మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ప్రధాని, హోంమంత్రి స్పందించరు. ఏపీలో రాజకీయాలు చేయాలనుకొంటున్న తెలంగాణ సిఎం కేసీఆర్ స్పందించరు.
ఆయన కుమారుడు, కాబోయే తెలంగాణ సిఎం… కేటీఆర్ మరో అడుగు ముందుకు వేసి “ఏపీలో టిడిపి, వైసీపిల మద్య రాజకీయ పంచాయితీతో మాకేమి సంబంధం?చంద్రబాబు నాయుడు అరెస్టుపై మేమేందుకు స్పందించాలి?ఆయన కోసం ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా ధర్నాలు చేసి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోము. కావాలంటే మీ రాష్ట్రానికి వెళ్ళి ధర్నాలు చేసుకోండి,” అని నిష్కర్షగా చెప్పేశారు. ఇది ఏపీలో పార్టీల, ప్రజల సమస్య అని తేల్చేశారు.
త్వరలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. తెలంగాణలో లక్షల మంది ఆంధ్రా ఓటర్లున్నారు. కనుక చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి ఏమి మాట్లాడితే లాభామా నష్టమా అని లెక్కలు కట్టుకొంటూ బిఆర్ఎస్ పార్టీ నేతలు ఇంతకాలం మౌనంగా ఉండిపోయారు.
మంత్రి హరీష్ రావు వంటి సీనియర్లు ఒకరిద్దరు ‘అయ్యో’ అన్నారు తప్ప అంతకు మించి ఒక్క ముక్క అదనంగా మాట్లాడలేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగతం, వారి అభిప్రాయాలతో పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేదని ముందే ‘నష్ట నివారణ మంత్రం’ చెప్పుకొన్నారు కూడా.
అయితే చంద్రబాబు నాయుడు విషయంలో తమ తటస్థ వైఖరి కారణంగా రేపు ఎన్నికలలో ఆంద్రా ఓటర్లు తమకు ఓట్లు వేస్తారో లేదో అనే భయం మొదలైన్నట్లుంది.
అందుకే నిన్న మంత్రి కేటీఆర్ ఖమ్మంలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత “మాకు రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో తెలీదు. మాకు రాముడైనా కృష్ణుడైనా ఎన్టీఆరే… తెలుగువారిని అందరూ గుర్తించేలా చేసిన మహానుభావుడు. ఆయన శిష్యుడే మా తండ్రిగారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టారు. నాకు తారక రామారావు అని పేరు పెట్టారు. తారక రామారావు పేరు చాలా పవర్ ఫుల్,” అంటూ పొగిడారు.
ఈ విగ్రహావిష్కరణ, ఈ పొగడ్తలు అన్నీ తెలంగాణలోని ఆంద్రా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకే అని అర్దమవుతూనే ఉంది. ఆంధ్రా రాజకీయాలతో మాకు సంబందం లేదంటారు. కానీ ఏపీ రాజకీయాలలో, ఎన్నికలలో వేలుపెడుతూ ఎవరిని గద్దె దించాలి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో నిర్ణయిస్తుంటారు.
ఆంధ్రావాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి హైదరాబాద్లో మాట్లాడటానికి వీల్లేదు వెళ్ళి ఏపీలోనే తేల్చుకోమంటారు. కానీ మరిచిపోకుండా బిఆర్ఎస్ పార్టీకి ఓట్లేయమని కోరుతుంటారు. ఏపీ ప్రజల మనోభావాలతో సంబంధం లేదనుకొన్నప్పుడు మళ్ళీ వారి ఓట్లు ఎందుకు ఆశించడం?
బిఆర్ఎస్ నేతలకు మంచి వాక్చాతుర్యం, మంచి ఎన్నికల వ్యూహ నైపుణ్యం ఉంటే సరిపోదు. ఏపీ ప్రజలు కేవలం ఓటర్లు మాత్రమే కాదు మనుషులు కూడా… వారికీ మనోభావాలు, రాజకీయ అభిప్రాయాలూ, హక్కులు ఉంటాయని గ్రహిస్తే మంచిది.
అయినా చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించాలని టిడిపి నేతలు ఎవరూ కేసీఆర్ని వేడుకోవడం లేదు కదా? కానీ స్పందించకుండా మౌనంగా ఉండటం ద్వారా జగన్ నిర్ణయాన్ని, చంద్రబాబు నాయుడు అరెస్టును కేసీఆర్ గట్టిగా సమర్ధిస్తున్నట్లు స్పష్టం అవుతోంది కదా?మరెందుకు ముసుగులో ఈ గుద్దులాటలు?



