ఆర్కె. రోజా మంత్రికాక మునుపు మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి జబర్దస్త్ షోలో పాల్గొనేవారు. నేటికీ వారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొనేంత సత్సంబందాలే ఉన్నాయి. ఇక చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నందున ఆయనతో రోజాకు, వైసీపీ నేతలకు ఎటువంటి శతృత్వం లేదనే చెప్పవచ్చు. అందుకే చిరంజీవి భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి ఎదుటే ఆమె ఆయనతో సెల్ఫీలు దిగారు.
మెగా బ్రదర్స్లో ఇద్దరితో బాగానే వ్యవహరించే మంత్రి ఆర్కె. రోజా వారి సోదరుడు పవన్ కళ్యాణ్ను మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా నోటికి వచ్చినట్లు విమర్శిస్తూనే ఉంటారు. కారణం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈరోజు సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, మంత్రుల తీరుని నిశితంగా విమర్శిస్తూ ఎందుకీ ఘర్జనలు? అంటూ వరుసగా ట్వీట్స్ పెట్టారు.
తమ అధినేతను, ప్రభుత్వ విధానాలను ఎవరైనా విమర్శిస్తే అందరి కంటే ముందుగా ఏ మంత్రి స్పందించారు?ఎవరు ఎంత ధీటుగా స్పందించారు?అనే అంశాలకు తాడేపల్లిలో మార్కులు పడుతుంటాయి.
తిరుమలలో పర్యటిస్తే చాలు… రాష్ట్రమంతటా పర్యటించినట్లే అని భావించే పర్యాటక శాఖ మంత్రి రోజమ్మ మళ్ళీ ఇవాళ్ళ మరోసారి శ్రీవారిని దర్శించుకొన్న తర్వాత పవన్ కళ్యాణ్పై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ ఓ కుంభకర్ణుడు… ఆరు నెలలు పడుకొంటాడు… మరో ఆరు నెలలు మెలకువగా ఉంటాడని విమర్శించారు. గత ఎన్నికలలో టిడిపి, బిజెపిల కోసం ఎన్నికల ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్కు ఉత్తరాంద్ర జిల్లాల ప్రజలు కనిపించడం లేదా?అని ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు హయాంలో నోరు విప్పని పవన్ కళ్యాణ్ ఇప్పుడు విశాఖ జిల్లా గురించి మొసలి కన్నీళ్ళు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఏదో పార్టీ పెట్టేసి ఆరు నెలలు రాజకీయాలు, ఆరు నెలలు సినిమాలు చేసుకొనే పవన్ కళ్యాణ్ వంటి రాజకీయ నాయకుడు మనకు అవసరమా? అని రోజా ప్రశ్నించారు. ప్రజలు ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏమి చేశారో చెప్పాలని రోజా ప్రశ్నించారు. ఇంకా చాలా విమర్శలు చేశారు.
కొండమీద ఉన్నప్పుడూ అందరూ శ్రీవారిని స్మరించుకొంటారు కానీ రోజమ్మ కొండ దిగకమునుపే నోరు కంపు చేసుకొంటున్నారు. ఆమె తిరుమల శ్రీవారి సన్నిధిలో నిలబడి ఇతరుల గురించి ఈవిదంగా చెడ్డగా మాట్లాడటం వలన ఆమె ఇంకా ఎన్నిసార్లు దైవదర్శనం చేసుకొన్నా ప్రయోజనం ఉండదు.
ఇక ప్రతిపక్ష నాయకుడిని రాష్ట్రానికి, ప్రజలకు ఏమి చేశారని ప్రశ్నించే ముందు ఓ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆమె రాష్ట్రానికి ఏమి మేలు చేస్తున్నారో చెపితే బాగుండేది. అలాగే మంత్రి కాకమునుపు ఆమె ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు ఏమి చేశారో తెలీదు కానీ జబర్దస్త్ షోకి మాత్రం టంచనుగా హాజరయ్యేవారని అందరికీ తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అయన ప్రతిపక్ష నేతగా ఉండగానే రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొన్న కౌలు రైతుల కుటుంబాలకు సుమారు 70 లక్షల రూపాయలు పంచిపెట్టారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బాధితులను ఆదుకొనేందుకు తన శక్తిమేర కృషిచేశాడు. ఇక ఆయన చేసిన చేస్తున్న గుప్తదానాలకు అంతే లేదు. ఈ విషయాలన్నీ మంత్రి ఆర్కె. రోజాకు కూడా తెలుసు. కానీ తమ అధినేత చేత మంచి మార్కులు వేయించుకోవాలనే తాపత్రయంతో పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకొంటున్నారు.
అయితే వైసీపీలో, నగరి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులున్నారనే సంగతి ఆమె గుర్తుంచుకొంటే మంచిది. ఒకవేళ చిరంజీవి బహిరంగంగా పవన్ కళ్యాణ్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్పై ఈవిదంగా నోరు పారేసుకొనే మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ దగ్గర ఎన్ని మార్కులు పడినా ప్రయోజనం ఉండకపోవచ్చు.



