మార్గదర్శి సంస్థ ఆర్ధిక క్రమశిక్షణ, దానిపై ప్రజలకున్న నమ్మకం వల్లనే అది ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో విస్తరించి దశాబ్ధాలుగా విజయవంతంగా వ్యాపారం సాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ గర్వించ దగ్గ సంస్థలలో మార్గదర్శి కూడా ఒకటి.
కానీ అది రామోజీరావు గ్రూపుకు చెంది ఉండటం, ఆ గ్రూపులోని ఈనాడు మీడియా జగన్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, దాని అవకతవకలను, అక్రమాలను బయటపెడుతుండటంతో జగన్ ప్రభుత్వం మార్గదర్శిని సిఐడీ విచారణ, సోదాల పేరుతో అనేక రకాలుగా వేధించింది. సొంత మీడియాలో మార్గదర్శి గురించి చాలా దుష్ప్రచారం చేసింది కూడా.
అయినప్పటికీ ప్రజలు మార్గదర్శి సంస్థపై నమ్మకం కోల్పోలేదు. ఓ వైపు జగన్ ప్రభుత్వం, వైసీపి సొంత మీడియా నిత్యం రామోజీరావుపై బురద జల్లుతుంటే, మంత్రి రోజా మార్గదర్శిలోనే తన డబ్బుకి భద్రత, పెరుగుదల ఉంటుందని భావించడం విశేషం.
ఆమె శనివారం నగరి వైసీపి అభ్యర్ధిగా నామినేషన్స్ వేశారు. వాటితో పాటు సమర్పించిన అఫిడవిట్లో ఆమె తన ఆస్తులు, అప్పుల వివరాలు పేర్కొంటూ వాటిలో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో తనకు రూ.39,21,120 ల విలువగల చిట్ (నంబర్: ఎల్టీ 030వీ- ఎంఏ48) ఉందని పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు మార్గదర్శి ఓ ఫ్రాడ్ సంస్థ అయితే మరి మంత్రి రోజా అదే మార్గదర్శిలో ఏకంగా రూ.39 లక్షల చిట్ ఎందుకు వేసిన్నట్లు? అంటే మార్గదర్శి నమ్మకమైన సంస్థ అని మంత్రి రోజా నమ్ముతున్నట్లే కదా? అంటే జగన్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, జరిపిస్తున్న సిఐడీ విచారణలు అన్నీ రాజకీయ కక్ష, ద్వేషంతో చేస్తున్నవే అని అనుకోవచ్చు కదా?
ఇంతకీ మార్గదర్శిలో చిట్ గురించి మంత్రి రోజా ఏం సర్ధిచెప్పుకుంటారో… వైసీపి ఏమి చెప్పుకుంటుందో?






