వైసీపీ నేతల తీరు నానాటికీ శ్రుతి మించుతోందనడానికి ఈ పోస్టరే ఓ తాజా నిదర్శనం. గత ఏడాది మేలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు తన వద్ద డ్రైవరుగా పనిచేసే సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని దారుణంగా హత్య చేసి, అతని శవాన్ని తన కారులోనే తీసుకువెళ్ళి అతని తల్లితండ్రులకు అప్పగించాడు.
ఆ కేసులో అనంత బాబు అరెస్ట్ అయ్యి ఏడెనిమిది నెలలు జైల్లో ఉండి ఎట్టకేలకు బెయిల్పై విడుదలై బయటకు వచ్చి స్వేచ్ఛగా జీవిస్తున్నాడు. హత్య చేసి జైలుకి వెళ్ళిన అతను బెయిల్పై బయటకు వస్తుంటే అతని అనుచరులు బాజాభజంత్రీలతో ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. అదే విచిత్రం అనుకొంటే, శుక్రవారం రాత్రి కాకినాడలో డా.అంబేడ్కర్ విగ్రహం పక్కనే అనంత బాబు ఫోటోతో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ పెద్ద ఫ్లెక్సీ బ్యానర్ పెట్టారు.
అది చూసి అందరూ ముక్కున వేలేసుకొంటున్నారు. ఓ దళిత యువకుడుని హత్య చేసిన వ్యక్తి సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతుండటమే కాక ‘నేను తిరిగి వచ్చేశా… ప్రత్యర్దులూ కబడ్దార్’ అన్నట్లు ఫ్లెక్సీ బ్యానర్ కూడా పెట్టుకొంటే మరి పోలీసులు ఏమి చేస్తున్నారో తెలీదని కాకినాడ ప్రజలు గుసగుసలాడుకొంటున్నారు.
వైసీపీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో సహా పలువురు ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన కుమారుడు రాఘవ్ రెడ్డి ఇదే కేసులో జైలులో ఉన్నారు. ఇవన్నీ సరిపోవన్నట్లు హత్యానేరం కింద జైలుకి వెళ్ళివచ్చిన అనంతబాబు ఈవిదంగా హడావుడి చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే, ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ?’ అనిపించక మానదు.



