లండన్ లో జరిగిన భారత్ – ఇంగ్లాండ్ చివరి ఐదవ టెస్ట్ నువ్వే-నేనా అన్నట్టు సాగిన ఉత్కంఠ పోరులో భారత్ 6 రన్స్ తేడాతో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. అలాగే ఈ విజయంలో హైద్రాబాద్ ఆటగాడు సిరాజ్ తన బౌలింగ్ తో సంచలనం సృష్టించారు.
ఈ టెస్ట్ సిరీస్ మొత్తంలో మొహమ్మద్ సిరాజ్ ఏకంగా 23 వికెట్లు పడగొట్టి, భారత్ ఈ సిరీస్ ను డ్రా చేసుకునే ప్రక్రియలో అందరి కన్నా ఒక మెట్టు ఎక్కువ కష్టపడ్డారు, అలాగే తన బౌలింగ్ తో గ్రౌండ్ లో ప్రత్యర్థి బ్యాటర్ల మీద ఆధిపత్యాన్ని చలాయించాడు.
బుమ్రా, స్టోక్స్, ఆర్చర్, ఆకాష్, టోంగ్ వంటి ఎందరో పేసర్లు ఈ సిరీస్ లో భాగమైన, ఏ ఒక్క ఆటగాడు కూడా వరుసగా 5 మ్యాచ్లను ఆడిన సంఘటన లేదు. మొదటి టెస్ట్ మొదటి రోజున ఫీల్డ్ లో అడుగు పెట్టిన సిరాజ్, మరలా ఐదవ టెస్ట్ ఐదవ రోజునే ఇంగ్లాండ్ లాస్ట్ వికెట్ పడగొట్టి గ్రౌండ్ నుంచి బయటకొచ్చారు.
ప్రపంచంలోనే టెస్ట్ లలో నెంబర్ 1 బౌలర్ గా ఉన్న బుమ్రా సైతం తాను వరుసగా 5 మ్యాచ్లు ఆడలేనంటూ, కేవలం 3 మ్యాచ్లకే పరిమితమయిన వేళ, సిరాజ్ భారత బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాడు.
రెండవ టెస్ట్ మరియు ఐదవ టెస్ట్ లో బుమ్రా లేకపోవటంతో భారత్ ఏమైనా తడపడుతుందా అని సీనియర్స్ అనుకున్న వేళ, మొహమ్మద్ సిరాజ్ తన శైలికి భిన్నంగా, తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటికి తీసుకువచ్చి, భారత్ కు భరోసా అయ్యి నిలిచాడు.
బుమ్రా లేని రెండు మ్యాచ్లలో, ఒక ఇన్నింగ్స్ లో 6 వికెట్లు మరో మ్యాచ్ లో 9 వికెట్లు పడగొట్టి డీ.ఎస్.పీ సిరాజ్ అంటే ఏంటో ఇంగ్లాండ్ గడ్డ పై నిరూపించాడు. కేవలం వికెట్లు తీయటమే కాకుండా, ప్రత్యర్థి ఆటగాళ్లను ఎల్లప్పుడూ తన చిలిపి పలుకుకతో కవ్వించాడు.
రూట్, స్టోక్స్, క్రాలీ, డకెట్ వంటి వారికీ ధీటైన పోటీ ఇచ్చాడు. ఇదే కాక, 3 వ టెస్ట్ లో అత్యవసర పరిస్థితిలో తాను ముందడుగు వేసి బ్యాట్ తో కూడా ఇంగ్లాండ్ కు ధీటైన పోటీ ఇచ్చాడు.
5 వ టెస్ట్ నాల్గవ రోజు బ్రూక్ క్యాచ్ ను విడిచిన సిరాజ్, అందుకు ప్రతిగా మ్యాచ్ లో భారత్ ఓటమి అంచుల వరుకు వెళ్లినప్పటికీ, సిరాజ్ 5 వికెట్లతో భారత్ ను గెలిపించాడు. ఇలా, సిరాజ్ కు ఇదొక గుర్తుండిపోయే సిరీస్ అవుతుంది!
అయితే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భారత్ ఈ ఐదవ టెస్ట్ ను అందుకుని సిరీస్ ను డ్రా గా ముగించింది. 2 ,5 వ మ్యాచ్ లో నెగ్గి, 4 వ మ్యాచ్ ను డ్రా చేసుకున్న భారత్ సిరీస్ ను 2 -2 తో సమం చేసింది. ఐదవ మ్యాచ్ లో సిరాజ్ చూపిన ప్రతిభ కు బహుమానంగా ‘ప్లేయర్ అఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.





