ఏపీ ప్రతిష్ట మొయినాబాద్‌లో గంగ పాలు!

AP leaders involved in Moinabad farmhouse drug party controversy in Telangana

తెలంగాణ ఉద్యమాలతోనే ఆంధ్రా పట్ల తెలంగాణలో విద్వేష భావనలు రగులుకున్నాయి. వాటిని కేసీఆర్‌ పదేళ్ళ పాలనలో ఇంకా పెంచి పోషించారు. నేటికీ బీఆర్ఎస్‌ పార్టీ మనుగడకు, తెలంగాణలో రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఏపీ పట్ల విద్వేషాన్నే సెంటిమెంటుగా మలిచి ఆయుధంగా వాడుకుంటున్నారు.

కనుక ఇప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు సఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నా ఉండలేని దుస్థితి దాపురించింది.

ADVERTISEMENT

ఇలాంటి సమయంలో ఏపీకి చెందిన అధికార, ప్రతిపక్ష నాయకులు హైదరాబాద్‌కు వెళ్ళి అక్కడ సమస్యలు సృష్టిస్తే రెండు ప్రభుత్వాలకు కొత్త తలనొప్పులు మొదలవుతాయి కదా? ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ ముగ్గురూ ఎంతో శ్రమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రతిష్టని క్రమంగా పెంచుతుంటే, కొందరు నేతలు ఈవిధంగా చేసి ఏపీ ప్రతిష్టని మంట గలుపుతున్నారు కదా?

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలట్ రాజశేఖర్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌసులో డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌తో సహా పలువురు పట్టుబడటంతో రెండు ప్రభుత్వాలకు తలనొప్పులు మొదలవడమే. ఈ అంశంపై సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు, విమర్శలు వినిపిస్తున్నాయి.

1. టీడీపిని, సిఎం చంద్రబాబు నాయుడుని బీఆర్ఎస్‌ నేతలు అంత తీవ్రంగా ద్వేషిస్తూ, తెలంగాణ నీటిని దొంగతనం చేస్తున్నారని ఆరోపిస్తున్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ ఏవిధంగా బీఆర్ఎస్‌ నేత ఇంట్లో పార్టీకి హాజరయ్యారు?

2. అదేవిధంగా బీఆర్ఎస్‌, టీడీపి నేతలు కలిసి ఇలా పార్టీలు చేసుకుంటునప్పుడు, మళ్ళీ ఈ యుద్ధాలు విమర్శలతో తాము బద్ద శత్రువులమన్నట్లు ప్రజలను మభ్యపెట్టడం దేనికి?

3. ఓ పక్క టీడీపి కార్యకర్తలు పార్టీ కోసం చెమటోడ్చి పనిచేస్తుంటే, ప్రజా ప్రతినిధులు ఫామ్‌హౌసులో డ్రగ్ పార్టీలు చేసుకుంటారా?

4. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తామని ప్రమాణ స్వీకారం చేసిన ప్రజా ప్రతినిధులు ఈ విధంగా డ్రగ్స్ సరఫరా ముఠాలతో సంబంధాలు కలిగి ఉండటం, డ్రగ్స్ కొనుగోలు చేయడం, వాడటం, డ్రగ్ పార్టీలు చేసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?

5. డ్రగ్స్ రవాణా, కొనుగోలు, వాడకాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని ప్రగల్భాలు పలికే ప్రభుత్వాలు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టుబడితే చర్యలు తీసుకోరా?వారికెప్పుడూ మినహాయింపులేనా? మరి అలాంటప్పుడు ఉక్కుపాదాలు దేనికి? అవి సామాన్యులకే పరిమితమా?

6. ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య సినిమాలు, రాజకీయాలు, నీళ్ళ పంపకాలపై గొడవలున్నాయి. ఇవన్నీ చాలవన్నట్లు ప్రజా ప్రతినిధులే ఇలా కొత్త సమస్యలు సృష్టిస్తే ఎలా?

7. ఈ కేసులో బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయాడు కనుక ఆ పార్టీ వెనక్కు తగ్గింది. లేకుంటే టీడీపి, సిఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడకుండా ఉండేదా?

సోషల్ మీడియాలో ఇంకా ఇలాంటి అనేక ప్రశ్నలు, విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కనుక బంతి సిఎం చంద్రబాబు నాయుడు కోర్టులోనే ఉంది. ‘ఉక్కు పాదం’విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని, పార్టీ నేతలెవరూ హైదరాబాద్‌లో ఇలాంటి సమస్యలు సృష్టించరాదనీ గట్టిగా చెప్పాల్సిన సమయం ఇదే!

ADVERTISEMENT
Latest Stories