ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన జగన్మోహన్ రెడ్డకి చిట్టచివరి ఆశ ఆరుగురు రాజ్యసభ సభ్యులే. ఎన్డీయే ప్రభుత్వానికి రాజ్యసభలో సరిపడా బలం లేదు కనుక వారిని ఎరగా వేసి సమస్యల నుంచి తప్పించుకోవాలనుకొని ఉంటే ఆశ్చర్యం కాదు.
ప్రస్తుతం తెలంగాణలో ఇదే పరిస్థితిలో ఉన్న కేసీఆర్ కూడా రాజ్యసభ సభ్యులని బీజేపీకి అప్పగించేసి కూతురు కవితని విడిపించుకున్నారని కాంగ్రెసోళ్ళు కుళ్ళు జోకులు వేస్తున్న సంగతి తెలిసిందే.
కానీ జగన్ 175 అనుకుంటే దేవుడి స్క్రిప్ట్ లో 11 ఉన్నట్లు, రాజ్యసభ సభ్యులతో ఒడ్డున పడదామనుకుంటే, వాళ్ళు పార్టీకి, పదవులకి రాజీనామాలు చేసి టిడిపిలో చేరిపోతుండటం జీర్ణించుకోవడం జగన్కి చాలా కష్టమే.
మోపిదేవి వెంకట రమణ ఒక్కరే అనుకుంటే ఆయనతో పాటు బీద మస్తాన్ రావు కూడా వైసీపికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాలు చేసేశారు. వారిద్దరూ టిడిపిలో చేరిపోతున్నామని ప్రకటించేశారు కూడా.
ఇద్దరు సీనియర్ నాయకులను కోల్పోవడం ఒక నష్టమనుకుంటే, రాజ్యసభ సభ్యులలో ఇద్దరు తగ్గిపోవడం వైసీపికి మరో నష్టం.
వారి చేత రాజీనామాలు చేయించడం వెనుక చంద్రబాబు నాయుడు లౌక్యం, రాజకీయ చతురత కనబడుతోంది. ఇప్పుడు శాసనసభలో టిడిపి కూటమికి పూర్తి మెజార్టీ ఉన్నందున ఆ రెండు స్థానాలలో మళ్ళీ వారినే నిలబెట్టి గెలిపించుకోవచ్చు లేదా మంత్రి పదవులు దక్కని సీనియర్ నేతలకు ఆ రెండు సీట్లు కేటాయించుకోవచ్చు.
ఆ రెండు రాజ్యసభ సీట్లు టిడిపి కూటమికి దక్కితే రాజ్యసభలో ఎన్డీయే ప్రభుత్వ బలం పెరుగుతుంది. ఒకవేళ ఆ రెండు సీట్లు టిడిపికి లభిస్తే, కేంద్రంలో చంద్రబాబు నాయుడు పలుకుబడి మరింత పెరుగుతుంది కూడా. కనుక జగన్కి ఇది మామూలు నష్టం కాదనే భావించవచ్చు.




