‘ఆ నలుగురు’ సినీ ఇండస్ట్రీని శాసిస్తున్నారు… ముఖ్యంగా పెద్ద సినిమాల కోసం చిన్న సినిమాలను తోక్కేస్తున్నారు… చిన్న సినిమాలకు అసలు ధియేటర్లు దొరకకుండా చేస్తున్నారు… దీంతో సినీ పరిశ్రమ మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది… ఇవి గత కొన్ని సంవత్సరాలుగా చిన్న నిర్మాతల గగ్గోలు..! కానీ, త్వరలోనే వీటికి తెరపడబోతున్నాయన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
దాదాపు 10 వేల కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో కొత్తగా 1000 ధియేటర్లను నిర్మించేందుకు స్వదేశ్ గ్రూప్ సంస్థ ముందుకొచ్చింది. షాపింగ్ మాల్స్ లో ఈ ధియేటర్లను ఏర్పాటు చేస్తామని, చిన్న సినిమాల కోసమే వీటిని కేటాయిస్తామని సదరు సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మోటూరి కృష్ణప్రసాద్ తెలిపారు. అంతే కాకుండా రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ వంటి సినీ దిగ్గజాలతో ఓ కమిటీ ఏర్పాటు చేసి, పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ తరహాలో ఓ ఫిలిం ఇన్స్టిట్యూట్ ను కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు.
మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో గానీ, బహుశా చిన్న – పెద్ద సినిమాల మధ్య గొడవలకు కొంతైనా శుభంకార్డు పడే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఉన్న ధియేటర్లలో టికెట్ ధరలు తగ్గించినా, చిన్న సినిమాలు బ్రతికే అవకాశం ఉంటుందన్నది కూడా మరో మాట.



