తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఒంటి చేత్తో గెలిపించి ‘ప్లే ఆఫ్స్’ బరిలో నిలిపాడు కునాల్ పాండ్య. ‘డూ ఆర్ డై’ మ్యాచ్ లో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ 31, మార్టిన్ గుప్తిల్ 48 పరుగులతో సత్తా చాటగా, వన్ డౌన్ లో వచ్చిన కృనాల్ పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డ కృనాల్ కేవలం 37 బంతులను ఎదుర్కొని 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేసి, 206 పరుగుల భారీ స్కోర్ కు కారణమయ్యాడు.
లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఢిల్లీ తరపున డీకాక్ బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడుతున్న తరుణంలో ఆ వికెట్ తీసి కృనాల్ పాండ్య మ్యాచ్ ను ముంబై వైపుకు మలుపు తిప్పాడు. డీకాక్ 28 బంతుల్లో 40 పరుగులు చేసి ఔటైన తర్వాత ఇక ఢిల్లీ బ్యాట్స్ మెన్లలో ఎవరూ పోరాట పటిమను ప్రదర్శించలేకపోయారు. దీంతో 126 పరుగులకు ఢిల్లీ జట్టు ఆలౌట్ అయ్యింది. బూమ్రా 3 వికెట్లతో సత్తా చాటగా, కృనాల్ పాండ్య 2 వికెట్లు తీసాడు.
తాజా గెలుపుతో 14 పాయింట్లు సొంతం చేసుకుని మూడవ స్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది ముంబై టీం. ఈ ఒక్క గెలుపుతో ఐపీఎల్ టేబుల్ మొత్తం రసకందాయంలో పడింది. హైదరాబాద్ ఒక్క జట్టే ప్లే ఆఫ్స్ కు చేరుకోగా, మిగిలిన 3 స్థానాల కోసం 5 జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోటీ నెలకొంది.



