ఒక సినిమా హాలులో పని చేసే కార్మికుడి వద్ద ఎంత మొత్తం ఉంటుంది? అలాగే ఓ పానీ పూరి అమ్ముకునే వ్యక్తి వద్ద షుమారుగా ఎంత మొత్తం ఉండవచ్చు? జాగ్రత్తపరులు అయితే బహుశా వేలల్లో ఉండవచ్చు. కానీ, వీరు ఖాతాలలో కోట్ల రూపాయల సొమ్ము వెలుగు చూసింది. అసలు ట్విస్ట్ ఏమిటంటే… ఆ కోట్లు ఉన్న సంగతి వారికి కూడా తెలియకపోవడమే. నల్లధనం తరలించే ప్రముఖులు ఇలా సామాన్యులను అడ్డుపెట్టుకుని దాదాపు 1000 కోట్ల రూపాయలను విదేశాలకు తరలించారు.
ఈ స్కాంలో షుమారుగా 2 వేల కోట్లకు పైగా మొత్తాన్ని దేశం బయటకు పంపించిన భారీ కుంభకోణాన్ని ముంబై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు కనిపెట్టారు. నాలుగు జాతీయ బ్యాంకులు, ఓ ప్రైవేటు బ్యాంకుకు సంబంధమున్న ఈ స్కాం దక్షిణ ముంబై నుంచి ఆరు బ్యాంకు శాఖల్లో జరిగింది. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య పలువురి ఖాతాల నుంచి విదేశాలకు నిధులు మళ్లాయి. అనామకుల పేరిట ఖాతాలు తెరచిన బడాబాబులు, వారికి ఎంతమాత్రమూ తెలియకుండానే డబ్బును దేశం దాటించారు.
ఇందులో సినిమా హాలులో పని చేసే ఓ కార్మికుడి పేరిట ఉన్న ఖాతా నుంచి 400 కోట్లు, అలానే రైల్వే స్వీపర్, టికెట్ కలెక్టర్, పానీపూరీలు అమ్మే వ్యక్తుల పేరిట ఉన్న ఖాతాల ద్వారా 400 నుంచి 600 కోట్ల వరకూ ఫారిన్ ఖాతాలకు పంపారు. ఓ బోగస్ కంపెనీని స్థాపించడం, లావాదేవీ పూర్తి కాగానే వాటిని మూసివేయడం అక్రమార్కుల పనని డీఆర్ఐ అధికారి వివరించారు. ఒకే కంపెనీ ఈ స్కాంకు సూత్రధారని, ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి సరుకులు ఇంపోర్ట్ చేసుకున్నట్టు చూపారని, 25 కోట్ల ఖరీదు చేసే సరుకులు తెచ్చి, వందల కోట్ల రూపాయలను పంపుతున్నా బ్యాంకులు పట్టించుకోలేదని ఆరోపించారు.



