జనసేన పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉంటూ పవన్ కు చేదోడువాదోడుగా, పార్టీ నేతలకు, కార్యకర్తలు అండాదండగా ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నాదెండ్ల మనోహర్ ను ఇన్నాళ్ళుగా పవన్ కు తోక అంటూ వైసీపీ తో పాటుగా జనసేన అభిమానులు కూడా హేళన చేసారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోనే వైసీపీ అక్రమ భాగోతాల లిస్ట్ ఒక్కొక్కటి భయటపెట్టి నిత్యం ఏదొక వార్తలలో నిలుస్తున్నారు నాదెండ్ల. కాకినాడ ఫోర్ట్ లోని ద్వారంపూడికి అక్రమాలకు ద్వారాలు మూసారు. రేషన్ గుడౌన్స్ లో నిల్వ చేసిన రేషన్ లెక్కలు సరిచేసి మాజీ మంత్రి కొడాలి నాని అవినీతి చిట్టాను బయటపెట్టారు. ఇలా వైసీపీ ముఖ్యనేతల అక్రమ రేషన్ సరఫరాను ప్రజల ముందుంచారు.
ఒక మంత్రిగా నిత్యం తన శాఖ మీద సమీక్షలు నిర్వహిస్తూ, ఒక ఎమ్మెల్యే గా తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఒక జనసేన నేతగా పార్టీ కార్యకర్తలు, నేతలకు సమయం కేటాయిస్తూ అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు నాదెండ్ల. దీనితో ఇన్నాళ్లు ఈయన గారు పవన్ కు తోక లాంటి వారు అని హేళన చేసిన వారు సైతం తోక కాదు ఈయన జనసేన పార్టీకి తలే అంటూ కొనియాడుతున్నారు.
సైలెంట్ గా తన పని తానూ చేసుకుంటూ ఒక్కో వైసీపీ అవినీతి గుట్టు రట్టు చేస్తూ ప్రజలలో మంచి గుర్తింపుని, జనసేన పార్టీలో మంచి గౌరవాన్ని దక్కించుకుంటున్నారు నాదెండ్ల. ఇన్నాళ్ళుగా ఆయన మీద ప్రత్యర్థి పార్టీ తో పాటుగా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి ఎన్ని ఆరోపణలు వచ్చినా పవన్ మౌనం వహించడానికి కారణం ఇదే కావచ్చు అంటున్నారు జనసైనికులు.
పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్దత, ప్రజల పట్ల ఆయనకు ఉన్న బాధ్యత, పదవి మీద ఉన్న జవాబుదారీ తనం, ప్రభుత్వం పట్ల ఉన్న చిత్త శుద్ధి, పాలనలో ఉన్న నిజాయితీ, నాదెండ్ల మనోహర్ ను మరోమెట్టెక్కించింది. జనసేన ఓటమిలో ఉన్నప్పుడు పవన్ కు బలమయ్యాడు, జనసేన గెలుపులో పార్టీకి గౌరవం తెచ్చాడు. పవన్ తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వ పని తీరుకి అద్దం పడుతున్నారు నాదెండ్ల.




