నాదెండ్లగారు… ఇదేం వెర్రిప్రశ్న?

Nadendla Manohar JanaSenaగుంటూరు కలక్టర్ కార్యాలయం వద్ద గత 11 రోజుల నుంచి నల్లమడ రైతులు నిరసన దీక్షలు చేస్తున్నారు. వారేమీ తమకు ఆర్ధికసాయం చేయాలనో లేదా ట్రాక్టర్లు, రైతుభరోసా నిధులు విడుదల చేయాలనో ఆందోళన చేయడం లేదు. గుంటూరు ఛానల్ (సాగునీటి కాలువ)ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతున్నారు. నిజానికి చాలా ఏళ్ళుగా పర్చూరు రైతులు దీని కోసం పోరాడుతున్నారు. వారి సహనం నశించి ఇప్పుడు ప్రత్యక్షంగా ఆందోళనలు చేపట్టారు.

వారికి జనసేన సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “తమది రైతు పక్షపాత ప్రభుత్వమని జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు ఎమ్మెల్యేలు గొప్పగా చెప్పుకొంటుంటారు. కానీ అన్నదాతలు కాలువను పొడిగించమని కోరుతూ గుంటూరు కలక్టర్ కార్యాలయం వద్ద గత 11 రోజులుగా దీక్షలు చేస్తుంటే పట్టించుకొనే నాధుడే లేడు. పులిచింతల ప్రాజెక్టులో గేట్ విరిగిపోతే దానికి మరమత్తులు కూడా చేయయించలేదు ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేశారో చూపాలని నేను వైసీపీ నేతలను సవాలు చేస్తున్నాను,” అని అన్నారు.

ADVERTISEMENT

నిజానికి సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని పెద్దగా చెప్పుకోలేదు. ఎందుకంటే ఏమీ చేయలేదు కనుక. వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పధకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే దానికోసం క్యాలండర్ ప్రకటించి మరీ అమలుచేస్తోంది.

అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీలో అందరూ తాము ప్రతీ ఇంటికీ మేలు చేశామని, కనుక సంక్షేమ పధకాలను చూసే తమకు మళ్ళీ ఓట్లువేసి గెలిపించాలని గట్టిగా నొక్కి చెప్పుకొంటారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని కానీ అది చూసి ఓట్లు వేయమని గానీ ఏనాడూ వారు అడగడంలేదు. వైసీపీ నేతలే అభివృద్ధి గురించి మాట్లాడనప్పుడు, ఎక్కడ అభివృద్ధి చేశారో చూపాలని నాదెండ్ల మనోహర్‌ సవాల్ అర్దరహితమే కదా?

ఇక పర్చూరు రైతులు సాగునీటి కాలువని పొడిగించాలని కోరడం కూడా అత్యాశే. ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మురుగు కాలువ పనులు పూర్తిచేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యే అన్వర్ బాషా ఇటీవల మునిసిపల్ కౌన్సిల్ మీటింగులో చేతులు జోడించి మేయర్‌ని, అధికారులను వేడుకొన్నారు కదా? అధికార పార్టీలో ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మురుగు కాలువ పనులు పూర్తి చేయించుకోలేనప్పుడు పర్చూరు రైతులు ప్రభుత్వాన్ని కోట్లు ఖర్చు చేసి సాగునీటి కాలువను పొడిగించమని అడగడం ఏం సబబు?

ADVERTISEMENT
Latest Stories