టిడిపి, జనసేనలు కలవకుండా దూరంగా ఉంచేందుకు జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి అప్రయత్నంగా వాటిని ఆయనే స్వయంగా కలిపారు. కానీ చేసిన పొరపాటుని సరిదిద్దుకుని మళ్ళీ వాటిని విడగొట్టేందుకు జనసేనకు 60-70 సీట్లు అడిగి తీసుకోకపోతే అన్యాయమైపోతుంది అంటూ జనసేన నేతలను, కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది.
అయితే టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకుంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఆ రెండు పార్టీలు నిర్ణయించుకోవాలి కానీ మద్యలో వైసీపి ఉచిత సలహాలు అవసరమా?అని పవన్ కళ్యాణ్ అడిగినా వైసీపి తీరుమారలేదు.
పవన్ కళ్యాణ్ నిన్న రాజోలు, రాజానగరం స్థానాలకు జనసేన అభ్యర్ధులను ప్రకటించడంతో మళ్ళీ వైసీపి జనసేన, టిడిపిలను రెచ్చగొట్టి చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
టిడిపి, జనసేనలు కలిస్తే గెలిచి అధికారంలోకి రాగలమని, అప్పుడే వైసీపిని ఓడించి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించగలమని పవన్ కళ్యాణ్ నిన్ననే చెప్పారు. ఇరుకు చొక్కాలో సర్దుబాట్లు తప్పవని కూడా చెప్పారు. కనుక సీట్ల సర్దుబాట్ల విషయం తనకు వదిలేయాలని, ఎవరూ రెండు పార్టీల మద్య దూరం పెరిగేలా మాట్లాడవద్దని, మాట్లాడి వైసీపికి అవకాశం కల్పించవద్దని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు.
కానీ పవన్ కళ్యాణ్ హితోక్తులు తమ్ముడు నాగబాబు చెవికి ఎక్కిన్నట్లు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏమి జరగాలని కోరుకుంటున్నారో సరిగ్గా అదే జరిగేలా చేసేందుకు తన పాండిత్యం ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో “ప్రతీ చర్యకు ప్రతి చర్య ఉంటుందనే న్యూటన్ సిద్దాంతాన్ని కోట్ చేస్తూ, “కొన్నిసార్లు కొన్ని సిద్దాంతాలను గుర్తు చేయాల్సివస్తుంది…” అని ట్వీట్ చేశారు.
అంటే చంద్రబాబు నాయుడు అరకు, మండపేట అభ్యర్ధులను ప్రకటించినందుకు ప్రతిచర్యగా పవన్ కళ్యాణ్ రాజోలు, రాజానగరం అభ్యర్ధులను ప్రకటించారని నాగబాబు చెపుతున్నారన్న మాట. టిడిపి చర్యకు జనసేన ప్రతిచర్య ఉంటుందని హెచ్చరిస్తున్నారన్న మాట!
టిడిపి, జనసేనలు సీట్ల సర్దుబాట్లు చేసుకొని అభ్యర్ధులను ప్రకటించకమునుపే ఈవిదంగా కీచులాడుకోవడం వైసీపి నేతలకు, ముఖ్యంగా వారి అధినేత జగన్మోహన్ రెడ్డికు చాలా సంతోషం కలిగించే విషయమే! టిడిపి, జనసేనలు కలవకుండా దూరంగా ఉంచేందుకు, వాటిని విడగొట్టేందుకు తమ ప్రయత్నాలు ఏవీ ఫలించకపోయినా, కాగల కార్యం గంధర్వులే చేస్తారన్నట్లు టిడిపి, జనసేనలను నాగబాబు వంటివారే విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారిప్పుడు. కనుక తాము ఎంతగా ప్రయత్నించినా చేయలేకపోయిన ఈ పనిని నాగబాబో మరొకరో చేసిపెడతానంటే జగన్మోహన్ రెడ్డి వద్దంటరా?
జనసేన పార్టీలో రెండో స్థానంలో ఉన్న నాగబాబు చేసిన ఈ తాజా ట్వీట్ని చూసినప్పుడు, కొందరు జనసేన నేతలు, వాస్తవ పరిస్థితులు గ్రహించకుండా వారికి వంతపాడుతున్న మీడియాలో ఒక వర్గంలో వస్తున్న కధనాలు చూస్తున్నప్పుడు, జనసేనకు ‘ప్లాన్-బీ’ వంటిది ఏమైనా ఉందా అనే అనుమానం కలుగకమానదు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయనతో సహా వారందరూ కోరుకొంటున్నారు. పొత్తులో భాగంగా 175 సీట్లలో కనీసం 60-70 సీట్లు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
ఈ రెండు కోరికలు తీరాలంటే టిడిపికి గుడ్ బై చెప్పేసి మళ్ళీ బీజేపీతో చేతులు కలపడం ఒక్కటే దారి. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలని కలవబోతున్నారు కూడా. అది కూడా ఈ ప్లాన్-బీలో భాగమేనా? లేక బీజేపీని కూడా తమ కూటమిలో చేరాలని నచ్చజెప్పేందుకా?
పవన్ కళ్యాణ్ నిబద్దతని సందేహించడానికి లేదు. కానీ ఆయన చెప్పుకున్నట్లు పార్టీలో నానాటికీ టికెట్ల కోసం ఒత్తిడి పెరిగిపోతుంటే, ప్లాన్-బీ అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది కదా?
ఒకవేళ జనసేనకు ప్లాన్-బీ ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కంటే సంతోషించేవారు మరొకరు ఉండరు. అప్పుడే కదా వైసీపి గెలిచి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కాగలరు?
Just a few laws need to be reminded sometimes… pic.twitter.com/ZVgxlI6WT6
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 26, 2024




