‘దేవుడుని నమ్ముతారా?’ ఒక సమయంలో మహేష్ బాబును అడిగినపుడు… ‘అది ఏంటో తెలియదు గానీ, మనకు తెలియని శక్తి ఒకటి ఉందని, అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని’ సమాధానం ఇచ్చారు. అయితే తన ప్రతి సినిమా రిలీజ్ ముందర ఖచ్చితంగా కడప దర్గాను సందర్శించడం, అలాగే శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ప్రిన్స్ చేస్తుంటారు. గుడి, మసీదులను ఎలా దర్శించుకుంటారో, చర్చలకు కూడా ప్రిన్స్ అలాగే వెళ్తారన్నది అభిమానులకు తెలిసిన విషయమే.
“సర్వమతాల సారాంశం ఒక్కటే” అన్నది ప్రిన్స్ ఫ్యామిలీ సిద్ధాంతం కాగా, ప్రస్తుతం ప్రిన్స్ లేకుండా ఇతర కుటుంబ సభ్యులు తిరుమల విచ్చేసారు. మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ నేడు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలసి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆపద మొక్కులవాడికి నమ్రత తలనీలాలు సమర్పించుకుని మొక్కు చెల్లించుకున్నారు.



