కేసీఆర్ సర్కార్ మొదలుపెట్టిన ‘హరితహారం’ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ సెలబ్రిటీలందరూ భాగస్వామ్యులైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి మొదలు ఏ పార్టీకి సంబంధం లేని సంపూర్ణేష్ బాబు వరకు అందరూ మొక్కలు నాటారు. అయితే ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ల ఫ్యామిలీ సభ్యులు మాత్రం పాలు పంచుకోలేదు. పవన్ పాల్గొనకపోయినా, మెగా ఫ్యామిలీ నుండి చిరు, అల్లు అర్జున్ లతో సహా అల్లు అరవింద్ తదితరులు మొక్కలు నాటారు.
అలాగే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా సతీమణి విజయనిర్మలతో కలిసి మొక్కలు నాటి తన ఉద్దేశాన్ని చాటుకోగా, తాజాగా ప్రిన్స్ సతీమణి నమ్రత శిర్కొదర్ కూడా ‘హరితాహారం’లో పాల్గొన్నారు. ప్రిన్స్ అభిమానులతో కలిసి మొక్కలు నాటి నీరు పోసారు. దీంతో టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ కుటుంబాల నుండి కనీసం ఒక్కొక్కరైనా ఈ ‘హరితహారం’లో పాల్గొన్నట్లయ్యింది… ఒక్క నందమూరి కుటుంబ సభ్యులు తప్ప..! నందమూరి కుటుంబం అంటే బాలకృష్ణ తదితరులు ఉన్నప్పటికీ, ప్రత్యక్ష్య రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘బాలకృష్ణ అండ్ కో’ టీఆర్ఎస్ కార్యక్రమంలో భాగస్వామి అవుతారని ఆశించలేము.
కానీ, జూనియర్ పరిస్థితి వేరు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక సినీ హీరో మాత్రమే. మరి టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా తరలివచ్చిన ‘హరితహారం’కు జూనియర్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడమేనా? ఒకవేళ అదే అయితే మహేష్ బదులు కృష్ణ, నమ్రత వచ్చినట్లు జూనియర్ రాకపోయినా, తండ్రి హరికృష్ణ గానీ, సోదరుడు కళ్యాణ్ రామ్ గానీ, సతీమణి గానీ పాల్గొనవచ్చుగా! అని వ్యక్తమవుతున్న ప్రశ్నలు పలు చర్చలకు దారి తీస్తోంది.
రాజకీయాలకతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనాల్సిన ఆవశ్యకత లేదు. అయితే, సినీ ఇండస్ట్రీ నుండి ప్రతి ప్రముఖ కుటుంబ సభ్యులు భాగస్వామ్యులవుతూ… ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కుటుంబమే దూరంగా ఉండడం అనేది సహజంగానే సినీ, రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. బహుశా రాబోయే రోజుల్లో జూనియర్ ఈ లోటును భర్తీ చేస్తారేమో చూడాలి.



