టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా పార్టీ అగ్ర శ్రేణి నాయకులు పొత్తు ధర్మాన్ని బాగానే పాటిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలైన నాడే ఆపద సమయంలో తనకు తన పార్టీకి మద్దతుగా నిలబడిన పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియచేసారు . అలాగే నారా లోకేష్ కూడా తనకు పవన్ పెద్దన్నతో సమానం అంటూ పవన్ పై తనకున్న అనుబంధాన్ని పార్టీ కార్యకర్తలకు తెలియ చేశారు.
అలాగే జనసేన అధినేత పవన్ కూడా చంద్రబాబుకు ఉన్న రాజకీయ అనుభవాన్ని అందరు గౌరవించాలని, సుదీర్ఘ అనుభవం ఉన్న టీడీపీ పార్టీని తక్కువంచన వేయకూడదని ఇరు పార్టీల నేతలు సోదరభావంతో ప్రజాక్షేత్రంలో కలిసి పని చేయాలనీ తన పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు.రాష్ట్ర సంక్షేమానికి టీడీపీ – జనసేన పార్టీల పొత్తు చాలా అవసరమని దానిని నిర్వీర్యం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి వాటితో అప్రమత్తంగా ఉండాలంటూ ఇరు పార్టీల నేతలకు హితవు పలికారు.
ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల నేతలు ఉమ్మడి మానిఫెస్టో రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. అలాగే రెండు పార్టీల నాయకులు ఆత్మీయ సమావేశాల పేరుతో ఉమ్మడి కార్యాచరణకు బాటలు వేస్తున్నారు. ఇదిలా కొనసాగుతున్న తరుణంలో అక్కడక్కడ జరిగిన చిన్న చిన్న సమస్యలను కూడా బూతద్దంలో వేసి తమ సొంత కథనాలు వండి వడ్డిస్తున్నారు బ్లూ మీడియా వర్గాలు.
బ్లూ మీడియా నోటికి తాళం వేసే సంఘటన బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురంలో చోటుచేసుకుంది. సత్య సాయి జిల్లా హిందూపురంలో జరిగిన టీడీపీ – జనసేన పార్టీల సమన్వయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తన మెడలో టీడీపీ జెండాతో పాటుగా జనసేన జెండా కూడా ధరించి రెండు పార్టీల నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
టీడీపీ – జనసేన పొత్తు కొత్త శకానికి నాంది పలికిందని..,ఇప్పుడు రెండు పార్టీల నేతలు ద్రుష్టి పెట్టాల్సింది నీకెన్ని నాకెన్ని అంటూ సీట్ల పంపకాల మీద కాదు రెండు పార్టీల ఉమ్మడి లక్ష్యమైన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం మీదే అనేది గుర్తించి క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల నేతలు ముందుకెళ్లాలని పొత్తు ఆవశ్యకతను తెలియచేసారు. అలాగే పవన్ కళ్యాణ్ నాకు మాదిరే ముక్కు సూటి మనిషి అంటూ పవన్ పై తనకున్న అభిప్రాయాన్ని పంచుకున్నారు.
అయితే పొత్తు ధర్మంలో భాగంగా బాలకృష్ణ తీసుకున్న ఈ ముందడుగు ఇరు పార్టీల క్యాడర్ లో వచ్చినట్లయితే ఇక రెండు పార్టీల ఉమ్మడి లక్ష్యం నెరవేరడం ఎంతో దూరంలో లేదనే చెప్పాలి. పొత్తు అంటూ మాట చెప్పి ఒకరి జెండా ఒకరు పట్టుకొను అంటే అనుకున్న లక్ష్యం నెరవేరదని బాలకృష్ణ పరోక్షంగా ఇరు పార్టీల శ్రేణులకు హితవు పలికారు. పొత్తులో జెండాలు వేరైనా ఏజెండా ఒక్కటే ఉండాలి, పార్టీ గుర్తులు వేరైనా నొక్కే బటన్ ఒక్కటే ఉండాలి, పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా లక్ష్యం కళ్ళముందు కదలాలి. అప్పుడే పొత్తుకు రెండు పార్టీల అభిమానులు న్యాయం చేసిన వారవుతారు.




