ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం కాలక్రమేణా ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటుందో అదే విధంగా రాజధానిలేని రాష్ట్రంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే నలుగురిలో నవ్వులపాలవుతుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైనే కాదు తెలంగాణ ఎన్నికల పై కూడా అమరావతి ప్రభావం ఉంటుందని ఈ రోజు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లమయింది. గత ఎన్నికలలో జగన్ కు సహకారం అందించిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అదే జగన్ నిర్ణయాల పై అవహేళన చేస్తూ తమ రాజకీయాలకు అనువుగా వాటిని ఏమరుస్తున్నారు.
ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే హైద్రాబాద్ కు ఏపీలో అమరావతికి పట్టిన గతే పడుతుందని తెలంగాణ ప్రజలను హెచ్చరించారు.నేడు అమరావతిలో ఏంజరిగింది వ్యాపారాలు మొత్తం ఫినిష్ అయ్యాయి అంటూ హరీష్ రావు చేసిన విమర్శలు అమరావతి కి జరిగిన అవమానమా? లేక ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానమా? అనేది తేల్చుకోవాల్సింది ప్రజలే.
రాజధాని లేని అనాధ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను దేశ ప్రజల ముందు నిలబెట్టొద్దు అని, రాజధానికి భూములిచ్చిన రైతుల జీవితాలను రోడ్డుకు లాగొద్దని, జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, అమరావతి భూములిచ్చిన రైతులు గడిచిన నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం పై పోరాటం చేస్తూనే ఉన్నారు.అయినా వైసీపీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు సరికదా ఉద్యమాలు చేసిన వారి పై లాఠీలు తగిలించింది.
ఇప్పుడు పక్క రాష్ట్రాలు ఏపీ రాజధానులపై అవహేళనలు చేస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితి పై కూడా తెలంగాణ బిఆర్ఎస్ నేతలు ఇదే తరహా విమర్శలు చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం కానీ ఏపీ ప్రజలు కానీ కళ్ళు తెరిచి చేసిన తప్పుని సరిదిద్దుకోపోతే ఇక దేశంలో ఏ రాష్ట్రములో ఎన్నికలు జరిగిన అక్కడి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే ఉదాహరణ చుపిస్తారేమో అక్కడి ప్రభుత్వ పెద్దలు.
ప్రతిపక్షాల విమర్శలకు బూతులతో, కేసులతో సమాధానం చెప్పే సదరు వైసీపీ పెద్దలు ఇప్పుడు తమ మిత్రులైన బిఆర్ఎస్ నేతల విమర్శలకు ఎలా సమాధానం చెప్తారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు,ఏపీ ప్రజలు. అయినా తమ చేతులతో తామే గొంతు నులిమి చంపిన అమరావతి పై ఎవరెన్ని విమర్శలు చేస్తే మాకెందుకు అంటూ వైసీపీ నేతలు మోనంగా ఉండిపోతారో వేచి చూడాలి.






