ప్రస్తుతం ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీలో అంత సమర్ధవంతమైన నాయకుడు ఎవరున్నారు? అంటే అది శేష ప్రశ్నగానే మిగిలిపోనుంది. వారసుడిగా నారా లోకేష్ పేరు వినపడుతున్నా, నాయకత్వ లక్షణాల విషయంలో మాత్రం లోకేష్ కు అంత పరిజ్ఞానం లేదన్న విషయం తెలిసిందే. ఇక, బాలకృష్ణ సంగతి సరేసరి! అలాగే ఏకతాటిపై పార్టీని, కార్యకర్తలను నడిపించే వ్యక్తి ప్రస్తుతమైతే ఎవరూ తారసపడడం లేదు.
దీంతో విద్యావంతురాలిగానే కాక, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్న బాలకృష్ణ కూతురు, నారా వారి కోడలు అయిన బ్రాహ్మణిని త్వరలో రాజకీయ తెరంగ్రేటం చేయించనున్నారన్న వార్తలు ఇటీవల చాలానే వినిపించాయి. తెలుగుదేశం పార్టీ పరంగా కూడా దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో, ఇందులో ఎంతోకొంత నిజముందని భావించాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ, ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొన్న బ్రాహ్మణి, ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.
“తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని, అటువంటి వార్తలు పూర్తి నిరాధారమని” నారా బ్రాహ్మణి తేల్చి చెప్పారు. దీంతో బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై పూర్తి స్పష్టత వచ్చేసినట్లయ్యింది. మహిళ విద్యావంతురాలైతే కుటుంబం తద్వారా సమాజం, దేశం కూడా పురోగతి సాధిస్తుందని, హెరిటేజ్ సంస్థలో మహిళా సాధికారత కోసం చర్యలు తీసుకుంటున్నట్టు, ఇలాంటి మహిళా పార్లమెంట్ లాంటి సదస్సులు మహిళా సాధికారతకు ఎంతగానో ఉపయోగపడతాయని తన అభిప్రాయాలను వెల్లడించారు.



