ఒకప్పుడు ప్రజలతో మాట్లాడేందుకు బిడియపడే నారా లోకేష్ శుక్రవారం సాయంత్రం తిరుపతి అంకురా హాస్పిటల్ వద్ద విడిది కేంద్రంలో వందలామంది యువతీయువకులతో ముఖాముఖీ మాట్లాడి అందరినీ మెప్పించడం విశేషం. నేటికీ ప్రధాని నరేంద్రమోడీ, సిఎం జగన్మోహన్ రెడ్డి వంటి పలువురు ప్రముఖులు ప్రజలతో లేదా మీడియాతో ఇటువంటి ముఖాముఖీ సమావేశాలలో పాల్గొనరనే విషయం అందరికీ తెలిసిందే.
కానీ నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నిత్యం వివిద వర్గాల ప్రజల మద్య కూర్చొని వారి సమస్యలు అడిగి తెలుసుకొంటూ, వారడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెపుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా యువతీయువకులతో ‘హలో లోకేష్’ ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించడమంటే చాలా సాహసోపేతమైనదే. ఎందుకంటే, వారు ఈ కార్యక్రమంలో అనేక అంశాలతో పాటు నారా లోకేష్ వ్యక్తిగత విషయాల గురించి కూడా వారు ప్రశ్నలు సందించారు. వాటికి నారా లోకేష్ ఏమాత్రం తడబడకుండా చెప్పినతీరుకి, సమాధానాలకు యువత హర్షధ్వానాలు చేశారు.
ఈ కార్యక్రమంలో నారా లోకేష్ ‘బాబు బ్రాండ్, జగన్ బ్రాండ్’ అంటూ ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల గురించి వివరించినా తీరు యువతని చాలా ఆకట్టుకొంది.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండే రెండు బ్రాండ్స్ ఉన్నాయి. 1. చంద్రబాబు నాయుడు బ్రాండ్, 2. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. చంద్రబాబు నాయుడు బ్రాండ్ పేరు చెపితే బిల్ గేట్స్ వంటి పారిశ్రామికవేత్తలు కూడా వస్తారు. అదే… జగన్ బ్రాండ్ పేరు చెపితే అందరూ చంచల్గూడా జైలు వైపే చూస్తారు. అదీ… బ్రాండ్ ఇమేజ్ అంటే! ఈ జగన్ ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు, పెట్టుబడులు రావు. అన్నీ మన పొరుగు రాష్ట్రం తెలంగాణకే వెళ్ళిపోతుంటాయి. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలన్నా, వాటితో మీకు ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి,” అని నారా లోకేష్ చెపుతున్నప్పుడు యువతీయువకులు మళ్ళీ హర్షధ్వానాలు చేశారు.
“చంద్రబాబు నాయుడుకి ఓ విజన్ ఉందని మాకు తెలుసు. కానీ మీ విజన్ ఏమిటి?” అని ఓ యువకుడు అడిగిన ప్రశ్నకి నారా లోకేష్ సమాధానం చెపుతూ, “అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నిలపాలనేదే నా తాపత్రయం. ఇంకా ఎన్నేళ్లు ఇరుగు పొరుగు రాష్ట్రాలకి ఉద్యోగాల కోసం వలసలు వెళ్తాము?ఏం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చుకోలేమా? యువతకి ఇక్కడే ఉద్యోగాలు కల్పించలేమా?ఎందుకు సాధ్యం కాదు? టిడిపి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పరిశ్రమలని, ఐటి కంపెనీలని రప్పించి యువతకి ఉద్యోగాలు కల్పించి దానినే జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాను,” అని నారా లోకేష్ సమాధానం చెప్పారు.
“జూ.ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తానంటే ఆహ్వానిస్తారా?” అంటూ మరో యువకుడు ప్రశ్నించగా, “తప్పకుండా ఆహ్వానిస్తాను. నూటికి నూరు శాతం ఆహ్వానిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలని కోరుకొనే ప్రతీ ఒక్కరూ రాజకీయాలలోకి రావాలని ఆహ్వానిస్తాను. రాష్ట్రాన్ని బాగుచేసుకోవాలనే తపనతోనే 2014లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. కనుక వివిదరంగాలలో నిపుణులు, మేధావులు, అనుభవం ఉన్నవారి అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం. కనుక ఎన్ఆర్ఐలు కూడా ఏపీకి తిరిగివచ్చి రాజకీయాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ని అన్ని విదాలా అభివృద్ధి చేసుకొందాము రండి,” అంటూ నారా లోకేష్ ఈ వేదిక మీద నుంచి అందరికీ పిలుపునిచ్చారు.



