టిడిపి యువనేత నారా లోకేష్ గురువారం గన్నవరం నియోజకవర్గంలో అంపాపురం నుంచి కోడూరుపాడు, రంగన్నపాలెం,మల్లపల్లి, గన్నవరం మీదుగా యువగళం పాదయాత్ర (193వ రోజు) చేస్తూ మీర్జాపురం చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారు. రాత్రి 7.15 గంటలకు గన్నవరం పట్టణంలో అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటి వరకు నారా లోకేష్ 2553 కిమీ పాదయాత్ర పూర్తిచేశారు.
మొన్న సాయంత్రం యువగళం పాదయాత్రలో (191వ రోజు) భాగంగా గన్నవరం నియోజకవర్గంలోని చిన్న అవుటపల్లి జంక్షన్ చేరుకొన్నప్పుడు దారి పక్కనే ఉన్న ‘ఎలైట్ లిక్కర్ వాక్-ఇన్-స్టోర్’ కనబడితే నారా లోకేష్ దాని వద్ద ఆగి సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ప్రభుత్వ అధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణం. ఆ బోర్డుపై చాలా స్పష్టంగా ‘ప్రభుత్వ మద్యం దుకాణం’ అని పెద్ద అక్షరాలతో వ్రాసి ఉంది.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తానని గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పదేపదే చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం వ్యాపారమంతా గుప్పెట్లో పెట్టుకొని నడిపిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మద్యపాన నిషేధం అమలుచేస్తామని చెప్పి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిస్తోంది. అదే నారా లోకేష్ ఈ ఫోటోతో చూపించి జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇంతకీ నారా లోకేష్ ఏమన్నారంటే, “ఇంకెంతమంది తాళిబొట్లు తెంచుతావ్ జగన్?! మాటతప్పుడు, మడమతిప్పుడుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి. ఇది గన్నవరం నియోజకవర్గం చినఅవుటపల్లిలో జగన్ సర్కారు ఏర్పాటు చేసిన లిక్కర్ వాకిన్ స్టోర్. ఎన్నికల సమయంలో మద్యనిషేధం చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఆ పని చేయకపోగా… రకరకాల పేర్లతో వీధికొక మద్యం దుకాణాన్ని ఏర్పాటుచేసి మందుబాబులను మత్తులో ముంచుతున్నాడు. జె-బ్రాండ్ల మద్యంతో రాష్ట్రంలోని లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతూ తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నింపుకుంటున్నాడు. మద్యనిషేధం చేశాకే మళ్లీ ఓట్లడుగుతానని చెప్పిన నువ్వు ఏ మొఖం పెట్టుకొని జనం వద్దకు వెళతావ్ జగన్మోహన్ రెడ్డీ?!” అని ట్వీట్ చేశారు.



