30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయలేని మంగళగిరి నియోజక వర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడేలా చేసి పార్టీకి కానుకగా ఇస్తానని చెప్పిన నారా లోకేష్, ఈ సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో అత్యధిక మెజారిటీ 91,500తో గెలుపుని అందుకుని చరిత్ర సృష్టించారు.
2019లో ఎక్కడైతే ఓటమి చెందారో అక్కడ నుండే బరిలోకి దిగి విజయాన్ని అందుకోవడం లోకేష్ పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది. అందులో కూడా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ప్రజలు ఆశీర్వదించడం అనేది, ఏ విధంగా మంగళగిరిలో ప్రజలతో మమేకం అయ్యారో అర్ధమవుతోంది.
ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న నియోజకవర్గం కావడం మరియు రాష్ట్ర రాజధాని అయిన అమరావతికి అత్యంత చేరువలో ఉండడంతో మంగళగిరి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార పార్టీ డబ్బులు ఏరులై ఖర్చు పెట్టినా, ప్రజలు లోకేష్ వైపుకే మొగ్గు చూపడం హర్షించదగ్గ పరిణామం.
రాష్ట్ర వ్యాప్తంగా ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేసి ప్రజలతో సత్సంబంధం పెంపొందించుకున్న లోకేష్, మంగళగిరిలో పట్టును సాధించగలిగారు. స్థానికంగా ఉన్న త్రాగునీరు, రోడ్ల వసతి సదుపాయాలను ప్రతిపక్షంలో ఉండే నెరవేర్చిన లోకేష్, అధికారంలోకి వస్తే మరింతగా అభివృద్ధి చేస్తారని ప్రజలు బాగా విశ్వసించారని చెప్పవచ్చు.




