టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుదవారం సాయంత్రం నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి నేరుగా పెందుర్తి చేరుకొని రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు పెందుర్తి జంక్షన్ వద్ద జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి వేపగుంటలోని మీనాక్షీ కన్వెన్షన్ సెంటర్ చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.
గురువారం మధ్యాహ్నం వరకు అక్కడే విశాఖ టిడిపి నేతలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి సాయంత్రం 4.30 గంటలకు విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట (ఎస్.కోట) చేరుకొని రోడ్ షో, తర్వాత దేవీ జంక్షన్ వద్ద బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రి స్థానిక సిరికి రిసార్ట్స్ లో బస చేసి, మర్నాడు మధ్యాహ్నం వరకు జిల్లా టిడిపి నేతలతో సమావేశమవుతారు.
మళ్ళీ శుక్రవారం సాయంత్రం రోడ్డు మార్గంలో అనకాపల్లి జిల్లాలోని సుంకరమెట్ట జంక్షన్లో చేరుకొని రోడ్ షో, తర్వాత నెహ్రూచౌక్ వద్ద బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి, జిల్లా పర్యటనలకు బయలుదేరితే దారి పొడవునా పరదాలు కట్టించుకొని, ఏసీ కార్లలో మంది మార్బలం వెంటరాగా, సకల సదుపాయాలు కలిగిన వేదికలపై బటన్ నొక్కి ఒంటరినయ్యానని ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఆయన ముసలోడని ఎద్దేవా చేసిన చంద్రబాబు నాయుడు ఇంత వయసులో కూడా జనం మద్య తిరుగుతూ బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. టిడిపి యువనేత నారా లోకేష్ నాలుగు రోజులు కూడా పాదయాత్ర చేయలేరని వైసీపీ నేతలు భావిస్తే, ఆయన అప్పుడే వందరోజులు పాదయాత్ర పూర్తిచేసి నేడు 101వ రోజున నంద్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.
వైసీపీ నేతల చేతిలో అధికారం, యంత్రాంగం, అంగబలం, అర్దబలం అన్నీ పుష్కలంగా ఉన్నా, వారి అధినేత క్రమం తప్పకుండా నెలనెలా బటన్ నొక్కి సంక్షేమ పధకాలకు నిధులు విడుదల చేస్తున్నా, వారి ‘గడప గడపకి ప్రభుత్వం’, ‘నువ్వే మా నమ్మకం జగన్’ స్టిక్కర్స్ అంటించే కార్యక్రమాలకు ప్రజల నుంచి నిరసనలు, ఛీత్కారాలు ఎదుర్కోవలసివస్తోంది. వారి అధినేత, సిఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేసేందుకు వస్తున్నా కూడా ప్రజలను బలవంతంగా తరలించి, మద్యలో పారిపోకుండా కాపలా కాయవలసి వస్తోంది. అదే… చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రజలకు భవిష్యత్పై భరోసా కల్పిస్తూ హామీలు మాత్రమే ఇస్తున్నప్పటికీ వేలాదిగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చి వారికి బ్రహ్మరధం పడుతున్నారు. వైసీపీ, టిడిపి కార్యక్రమాలకు ప్రజాస్పందనలో ఈ తేడాను గమనిస్తే, రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొంటున్నారని స్పష్టం అవుతోంది కదా?



