టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం ఉదయం పూతలప్పట్టు నియోజకవర్గంలోని మొగిలి శివాలయం నుంచి 8వ రోజు యువగళం పాదయాత్రని ప్రారంభించారు. దారిపొడవునా ప్రజలు నారా లోకేష్కి ఘనస్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు నారా లోకేష్ని ఆపి ఆప్యాయంగా పలకస్తున్నారు. జగన్ పాదయాత్రలు చేసినప్పుడు ఆయనే అందరి నెత్తిన చేతులు పెడుతూ ఆశీర్వదించేవారు. కానీ యువగళం పాదయాత్రలో వృద్ధులు, మహిళలే నారా లోకేష్ని ప్రేమతో ఆశీర్వదిస్తున్నారు.
ఇక యువకులు, విద్యార్థులు, మహిళలు తనతో సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీలు పడుతుంటే నారా లోకేష్ ఏమాత్రం విసుక్కోకుండా వారితో సెల్ఫీలు దిగుతున్నారు. దీని వలన పాదయాత్ర చాలా ఆలస్యం అవుతున్నప్పటికీ, ప్రజలతో మమేకం అవడం కోసమే తాను పాదయాత్ర చేస్తున్నాననే సంగతి నారా లోకేష్ మరిచిపోలేదు. కనుక వీలైనంత వరకు అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు.
ఈరోజు పాదయాత్రలో విశేషమేమిటంటే, పలమనేరు సమీపంలోని గాంధీనగర్ జంక్షన్ మీదుగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నప్పుడు, కొందరు స్థానిక బిజెపి నేతలు వచ్చి యువగళం పాదయాత్రకి సంఘీభావం తెలుపుతూ ఆయనతో కలిసి కొంత దూరం కలిసి నడిచి అభినందనలు తెలిపి వెళ్ళారు.
వందలాదిమంది వెంటనడుస్తుండగా నారా లోకేష్ దారిలో శ్రీ మొగిలీశ్వర స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ముందుకు సాగారు. తర్వాత బలిజపల్లి గ్రామంలో ప్రజల మద్య కూర్చొని కాసేపు మాట్లాడారు. “పోలీసులు మొన్న నా చేతిలో నుంచి మైక్ లాక్కొన్నారు. నిన్న నా ప్రచార వాహనాన్ని పట్టుకుపోయేందుకు ప్రయత్నించారు. కానీ నేను గట్టిగా ప్రశ్నించడంతో విడిచిపెట్టారు. లేకుంటే ఈరోజు నేను కూర్చోన్న ఈ స్టూల్, ఈ వేదిక అన్నిటినీ పట్టుకుపోయేవారేమో?” అని నారా లోకేష్ అనేసరికి అందరూ విరగబడి నవ్వారు.
“అంటే దీనిని బట్టి ఏమర్ధం అవుతుందంటే ప్రజలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడిగి తమ హక్కులు కాపాడుకోవాలని! కనుక ఈసారి ఏ వైసీపీ నేతలో మరొకరో వచ్చి మిమ్మల్ని బెదిరించి భయపెట్టాలని చూస్తే ఏమాత్రం భయపడకుండా గట్టిగా నిలదీసి అడగండి. అప్పుడే వాళ్ళే వెనక్కి తగ్గుతారు,” అని నారా లోకేష్ అన్నారు.
అనంతరం నారా లోకేష్ వారి ఆశీర్వాదాలు తీసుకొని ముందుకు సాగారు. సాయంత్రం 5 గంటలకి బంగారుపల్లిలో జరిగే బహిరంగసభలో నారా లోకేష్ ప్రసంగించబోతున్నారు. ఈరోజు రాత్రి వజ్రాలపురంలో నారా లోకేష్ బస చేయనున్నారు.



