ఆంధ్రప్రదేశ్లో ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోగా, మరోవైపు జగన్ ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటిపన్ను, చెత్త పన్ను పేరుతో ప్రజలపై అదనపు భారం మోపుతుండటాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ‘బాదుడే…బాదుడు’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది.
ఈనెల 26 నుంచి 29 వరకు ఒంగోలు జరిగిన మహానాడుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది టిడిపి కార్యకర్తలు వచ్చి పాల్గొన్నారు. మహానాడు కూడా విజయవంతం అవడంతో తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది.
కనుక త్వరలోనే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే డిమాండ్ మొదలైంది. ఇదే ఊపులో నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ బాదుడే…బాదుడు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలతో మమేకం కావాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు.
మహానాడు ముగింపు రోజున కొందరు టిడిపి కార్యకర్తలు నారా లోకేష్ను కలిసి పాదయాత్ర చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్ధనపై స్పందిస్తూ, “ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలపై జగన్ ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీశాము. ఇకపై నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలను కూడా నిలదీయవలసి ఉంది. పార్టీ అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాదయాత్రకు బయలుదేరేందుకు సిద్దంగా ఉన్నాను,” అని చెప్పారు.
ఇప్పటికే ‘బాదుడే…బాదుడు’ నిరసన కార్యక్రమాల కారణంగా గడప గడపకి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తుండటంతో వారికీ, ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. కనుక నారా లోకేష్ పాదయాత్ర చేపట్టి నియోజకవర్గాలలో పర్యటిస్తే జగన్ ప్రభుత్వంపై ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. నారా లోకేష్ నియోజకవర్గాలలో పర్యటిస్తూ నిలదీస్తుంటే వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు తట్టుకోగలరో లేదో?



