“అమ్మ అన్నం పెట్టదు… మరొకరిని పెట్టనివ్వదు”, అన్నట్లు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చినరావూరులో ఇటీవల మరణించిన టిడిపి నేత పాటిబండ్ల నరేంద్రనాథ్ కుటుంబాన్ని నారా లోకేష్ ఈరోజు పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “నరేంద్రనాథ్ నాకు 2019 ఎన్నికల తర్వాత పరిచయం అయ్యారు. టిడిపిని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తుండేవారు. అటువంటి వ్యక్తి మరణించడం చాలా బాధ కలిగించింది,” అన్నారు.
అన్నా క్యాంటీన్లపై వైసీపీ నేతలు, కార్యకర్తలు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది దాడులు చేయడంపై నారా లోకేష్ స్పందిస్తూ, “అసలు అన్నా క్యాంటీన్లను చూసి జగన్ ప్రభుత్వం ఎందుకు ఇంతగా భయపడుతతోందో అర్దం కావడం లేదు. మీ ప్రభుత్వం పేదలకు అన్నం పెట్టదు కనీసం మేము పెడుతున్నప్పుడు మెచ్చుకోకపోయినా ఇలా మీదపడి ధ్వంసం చేయకూడదు కదా?
మంగళగిరి, కుప్పం, తెనాలిలో మా పార్టీ నేతలు అన్నా క్యాంటీన్లు పెడితే వాటిపై దాడి చేశారు. జగన్ ప్రభుత్వానికి అన్నా క్యాంటీన్లు అంటే గిట్టావా లేక వాటిని టిడిపి నేతలు నిర్వహించడం గిట్టదా?మీరు ఎన్నిసార్లు అడ్డుకొన్నా మేము అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తూనే ఉంటాము. పేదల కడుపులు నింపుతాము,” అని అన్నారు.
టిడిపి నేతలపై వైసీపీ గూండాలు భౌతిక దాడులు చేయడంపై స్పందిస్తూ, “మీ తాత రాజారెడ్డికే మేము భయపడలేదు. ఇక మీకు భయపడతామా? మీ తాటాకు చప్పుళ్ళకు టిడిపిలో ఎవరూ భయపడరని గుర్తుంచుకోండి. భౌతికదాడులు చేసి టిడిపిని అడ్డుకోవాలనుకొంటే అంతకంటే అవివేకం ఉండదు. మీరు మమ్మల్ని ఎంతగా అణచివేయాలని ప్రయత్నిస్తే అంతకు రెట్టింపు శక్తితో ఎదురుతిరిగి పోరాడుతామే తప్ప వెనక్కి తగ్గేదేలే,” అని నారా లోకేష్ అన్నారు.



