టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ముందే చాలా పదును తేలారు. గత 182 రోజులలో 2,400 కిమీకు పైగా పాదయాత్ర పూర్తిచేసేసరికి ఇంకా పదునుతేలారు. ఒకప్పుడు ఆయన ప్రసంగించేటప్పుడు తడబడేవారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు కురిపిస్తున్నారు. అంతేకాదు… తన ప్రసంగంలో పంచ్ డైలాగులు కూడా చెపుతూ జనాలను బాగా ఆకట్టుకొంటున్నారు.
ప్రస్తుతం పెదకూరపాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా డైలాగ్ తన శైలిలో చెప్పారు.
నారా లోకేష్ ఏమన్నారంటే, “చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు వస్తే మొరగని వైసీపీ కుక్కా లేదు… ఆయనపై రాళ్ళు వేయని చోటు లేదు. ఈ రెండూ జరగని ఊరూ లేదు. అయినా చంద్రబాబు నాయుడుగారు ఈ సైకో జగన్ని చూసి భయపడలేదు. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకే సాగుతున్నారు. అర్దమైందా రాజా?” అంటూ సిఎం జగన్కు, వైసీపీ మంత్రులకు, ఆ పార్టీ శ్రేణులకు చురకలు అంటించారు. కానీ మళ్ళీ ఆయనే చెపుతుంటారు… దున్నపోతు మీద ఎంత వాన పడినా చలించదని!
అంతకు ముందు నారా లోకేష్ ప్రజలతో ముఖాముఖీలో మాట్లాడుతూ, “ఆనాడు చంద్రబాబు నాయుడుగారు యువతకు పెన్నులు ఇస్తే, ఇప్పుడు జగన్ అందరికీ కత్తులు ఇచ్చి మాపైకి ఉసిగొల్పుతున్నాడు. ఆనాడు పెన్ను పట్టినవారు జీవితంలో ఎంతో ఉన్నతస్థాయికి ఎదగగా, ఇప్పుడు కత్తులు పట్టుకొని రోడ్డు మీద వీరంగం ఆడుతున్న వైసీపీ పిల్ల సైకోలు ఏదో ఓరోజు ఆ కత్తులకే బలైపోవడం ఖాయం. నాయకుడనేవాడు తాను ఆదర్శప్రాయంగా ఉంటూ ప్రభుత్వాన్ని, పార్టీని, ప్రజలను సరైన దిశలో నడిపించాలి. కానీ వైసీపీలో పై నుంచి కిందవరకు అందరూ ఒకటే బ్యాచ్… అందరూ సైకోలే,” అని నారా లోకేష్ చురకలు వేశారు.
ఒకప్పుడు నారా లోకేష్ని ఉద్దేశ్యించి రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు వంటివారు చాలా చులకనగా మాట్లాడేవారు. ఇప్పుడూ మాట్లాడుతున్నారు కానీ తగ్గించారు. ఎందుకంటే నారా లోకేష్ తాము అనుకొన్నంత సాఫ్ట్ కాదని, అలాగే సాఫ్ట్ టార్గెట్ కూడా కాదని బాగానే గ్రహించినట్లున్నారు.
నారా లోకేష్ నోట ఫేమస్ Rajinikanth Dialogue!#YuvaGalam#Jailer pic.twitter.com/wRvfutAC6u
— M9.NEWS (@M9Breaking) August 11, 2023



