టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ మీద రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపడంతో టిడిపి యువనేత నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో బ్రేక్ తీసుకొని నిన్న విజయవాడ చేరుకొన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్టుతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆవేశం, ఆందోళన నెలకొని ఉన్నందున, ముందుగా పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు నారా లోకేష్ ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తదితర సీనియర్ నేతలతో సమావేశమయ్యి తదుపరి కార్యాచరణను సిద్దం చేసుకొని అమలుచేయాల్సి ఉంటుంది. కనుక పార్టీలో పరిస్థితులు చక్కబడేవరకు కొన్ని రోజులు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు.
తాను తండ్రి బాటలోనే ముందుకు సాగుతూ జగన్ ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేస్తానని నారా లోకేష్ ట్వీట్ చేశారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పలుమార్లు తాను తన తండ్రి చంద్రబాబు నాయుడులా మెతక వైఖరితో సర్దుకుపోయేవాడిని కానని, మాటకు మాట, చర్యకు ప్రతిచర్య ఇస్తానని విస్పష్టంగా చెప్పారు. పాదయాత్రలో కడపలోనే ‘హూ కిల్డ్ బాబాయి’ అని ప్రశ్నించడం, పోలీసులు అడ్డుకొన్నప్పుడు, వైసీపి కార్యకర్తలు కవ్వించినప్పుడు నారా లోకేష్ వ్యవహరించిన తీరుతో అది నిరూపించుకొన్నారు కూడా. కనుక ఇప్పుడు ఏవిదంగా టిడిపి శ్రేణులను నడిపించబోతున్నారనేది నారా లోకేష్ రాజకీయ భవిష్యత్కి సూచికగా నిలువబోతోంది.



