టిడిపి యువనేత నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో 1200 కిమీ యువగళం పాదయాత్రలో పూర్తిచేశారు. తన పాదయాత్రలో ప్రతీ 100కిమీలకు ఒకటి చొప్పున నారా లోకేష్ శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. తమ ఆ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను వాటిపై లిఖింపజేస్తున్నారు. నారా లోకేష్ ఇంకా 305 రోజుల పాటు శ్రీకాకుళం వరకు అనేక నియోజకవర్గాల గుండా పాదయాత్ర చేయనున్నారు. మిగిలిన ఈ పది నెలల్లో మరో 30-40 శిలాఫలకాలను ఆవిష్కరించి హామీలు ఇవ్వబోతున్నారన్న మాట!
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలుచేయకపోతే, ఆ శిలాఫలకాలను చూపించి, ఆ నియోజకవర్గం ప్రజలే కాక ప్రతిపక్షాలు కూడా తమ ప్రభుత్వాన్ని నిలదీయవచ్చని నారా లోకేష్ చెపుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకొనేందుకు రకరకాల హామీలు ఇస్తుంటారు. ఆ తర్వాత వాటిని పక్కనపడేస్తుంటారు. కానీ ఇలా శిలాఫలకాలపై వ్రాయించి హామీలు ఇవ్వగల ధైర్యం నారా లోకేష్ వంటి ఏ కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే, తమ ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుందనే గట్టి నమ్మకం, వచ్చాక ఆ హామీలను అమలుచేయగలనన్న ఆత్మవిశ్వాసం ఉంది గనుకనే!
ప్రజా సంక్షేమం-రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా సాగుతున్న యువగళం పాదయాత్రలో నందికొట్కూరు నియోజకవర్గంలో 1200 కిమీ పూర్తయిన సందర్భంగా నారా లోకేష్ ఆవిష్కరించిన శిలాఫలకంలో “అల్లూరు వద్ద 22వేల ఏకరాలకి సాగు, 60 వేల మందికి తాగునీరు అందించేందుకు మిడుతూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తామని” హామీ ఇచ్చారు.



