టిడిపి యువనేత నారా లోకేష్ నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. నేడు 153వ రోజున ఆయన కొత్తపల్లి గ్రామంలో 2,000 కిమీ మైలురాయిని అధిగమించి తన పాదయాత్రలో మరో రికార్డ్ సృష్టించారు.
ఈ సందర్భంగా బ్రహ్మంగారి ఆలయం వద్ద నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో తన పాదయాత్రకు సహకరిస్తున్న ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు నారా లోకేష్ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
తన ఈ 153 రోజుల పాదయాత్రలో ప్రధానంగా గమనించినది ఏమిటంటే అన్ని వర్గాల ప్రజలు జగన్ బాధితులే అని గ్రహించానని చెప్పారు. టిడిపి హయాంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చి ఆరు లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తే, ఈ జగన్ పాలనలో ఎక్కడ చూసినా విధ్వంసం, అవినీతి, అరాచకాలే కనిపిస్తున్నాయని నారా లోకేష్ అన్నారు.
జగన్ ప్రభుత్వం ప్రశ్నించేవారి గొంతులు నొక్కేస్తోంది కనుకనే ప్రజల తరపున ప్రశ్నించేందుకు ఈ యువగళం పాదయాత్ర ప్రారంభించానని అన్నారు. ప్రజలు భయపడుతున్నకొద్దీ జగన్ ప్రభుత్వం వారిని ఇంకా ఇంకా అణచివేసి దోచుకొంటూనే ఉంటుందని, కనుక వైసీపీ నేతలను ధైర్యంగా నిలదీసి ప్రశ్నిస్తూనే ఉండాలని నారా లోకేష్ అన్నారు.
ఈ సందర్భంగా అక్కడ శిలాఫలకం ఆవిష్కరించారు. దానిలో కొత్తపల్లి ఆక్వారైతులకు చేయూతనిచ్చేందుకు ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తానని హామీని పొందుపరిచారు.
నారా లోకేష్ కనీసం 200 కిమీ కూడా పాదయాత్ర చేయలేరని గట్టిగా నమ్మిన వైసీపీ నాయకులు మొదట్లో నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేవారు. కానీ నారా లోకేష్ ముందుకే సాగుతుండటంతో, జీవో నంబర్:1 సాయంతో పోలీసులతో పాదయాత్రను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కానీ అప్పుడూ గట్టిగా ప్రతిఘటిస్తూ ముందుకు సాగుతుండేవారు.
ఆ వార్తలు మీడియాలో హైలైట్ అవుతుండటంతో నారా లోకేష్కు తామే అనవసరంగా ఉచిత పబ్లిసిటీ కల్పిస్తున్నామని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం అప్పటి నుంచి అడ్డుకోవడం మానుకొంది.
నారా లోకేష్ని తక్కువగా అంచనా వేశామని వైసీపీ నేతలు కూడా ఇప్పుడు బాగానే గ్రహించారు. ‘నేను బాబుగారిలా సాఫ్ట్ కాదు,’ అని నారా లోకేష్ వైసీపీ నేతలందరికీ అర్దమయ్యేలాగే చెపుతున్నారు. ఇది కూడా నిజమని వారు బాగానే గ్రహించారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు, కొందరు టిడిపి ముఖ్యనేతలను ఎదుర్కొంటే సరిపోయేది. కానీ ఇప్పుడు నారా లోకేష్ని కూడా ఎదుర్కోవలసివస్తోంది. కనుక ‘కొరివితో తల గోక్కొన్నట్లయింది మా పని’ అని వైసీపీ ఎమ్మెల్యేలు లోలోన బాధపడుతున్నారు.
నారా లోకేష్ పట్ల వైసీపీ నేతల అభిప్రాయాలే కాదు… వారు ఇదివరకు చేసిన దుష్ప్రచారం కారణంగా నారా లోకేష్ పట్ల చులకనభావం ఏర్పరచుకొన్న వివిద వర్గాల ప్రజలు కూడా ఆయనతో ముఖాముఖి మాట్లాడిన తర్వాత తమ అభిప్రాయాలు మార్చుకొని నీరాజనాలు పలుకుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వం మారాలని కోరుకొంటున్నారని ఇది స్పష్టం చేస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని టిడిపి మళ్ళీ ఏపీలో అధికారంలోకి రాగలదా?మరో 9 నెలల్లో తేలిపోతుంది.



