టిడిపి యువనేత నారా లోకేష్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. అంటే నేటికీ 171 రోజులుగా నడుస్తూనే ఉన్నారన్న మాట. మొదట ఆయన పాదయాత్ర చేయలేరని వైసీపీ నేతలు చిలక జోస్యం చెప్పారు. కానీ చేస్తుండటంతో పోలీసులతో అడ్డుకొనే ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం. దాంతో తామే ఆయనకి ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నామని గ్రహించి వెనక్కు తగ్గింది.
ఆయన పాదయాత్రకి ప్రజల నుంచి స్పందన రావడం లేదంటూ దుష్ప్రచారం చేసింది. కానీ న్యూస్ ఛానల్స్లో వేలాదిమంది జనాలతో ఆయన నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు చూస్తున్నారని, తమ దుష్ప్రచారం జనం నమ్మడం లేదని గ్రహించి అసలు నారా లోకేష్ పాదయాత్రను పూర్తిగా పట్టించుకోవడం మానేసిన్నట్లు నటించసాగింది.
మంత్రులందరూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని ఎదురుదాడి చేస్తూ ప్రజల దృష్టిని యువగళం పాదయాత్ర మీద నుంచి వారాహి యాత్రపైకి మళ్ళించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వారి వ్యూహం ఫలించిన మాట వాస్తవం. అయితే అంతమాత్రన్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆపేయలేదు. జనం ఆయనకు జేజేలు పలకడం మానేయలేదు. చిత్తూరు నుంచి ప్రకాశం వరకు నారా లోకేష్ 2,250 కిమీ పాదయాత్ర చేశారు. అడుగడుగునా జనం ఆయనకు జేజేలు పలుకుతూనే ఉన్నారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి తన బటన్ నొక్కుడు సభలలో రాష్ట్రంలో 97 శాతం మందికి ‘మేలు’ చేశామని కనుక ప్రజలందరూ తన పాలనలో చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారంటూ గొప్పలు చెప్పుకొంటారు. ప్రజలందరూ జగన్, వైసీపీల వైపే ఉన్నట్లయితే మరి నారా లోకేష్ సభలకు అన్ని వేలమంది ఎందుకు తరలివస్తున్నారు?దారిపొడవునా ప్రజలు ఆయనకు తమ కష్టాలు, నష్టాలు, బాధలు ఎందుకు మొరపెట్టుకొంటున్నారు?అని ఆలోచిస్తే ప్రజలు మార్పు కోరుకొంటున్నారనే సమాధానం దొరుకుతుంది.
ఈ నాలుగేళ్ళలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పనిచేయకపోయినా ప్రజలకు చాలా మేలు చేశామని, 175 సీట్లు మేమే గెలుచుకొంటామని ఆత్మవంచన చేసుకొంటున్నట్లే, నారా లోకేష్ సభలకు తరలివస్తున్నవారందరూ కూడా ‘పెయిడ్ ఆర్టిస్ట్’లని వాదిస్తూ ఆత్మవంచన చేసుకొంటోంది.
నారా లోకేష్ నిన్న అద్దంకిలో నిర్వహించిన సభకు వేలాదిమందిగా జనాలు తరలివచ్చారు. ఎంతగా అంటే రోడ్లమీద నిలబడేందుకు ఖాళీ లేక బస్సుల మీద ఎక్కి నిలబడ్డారు. జగన్ బటన్ నొక్కుడు సభలకు బలవంతంగా జనాలను తరలించి తీసుకువస్తున్నా మద్యలో లేచి పారిపోతుంటారు. అంటే అర్దం ఏమిటి?
వైసీపీ ఆత్మవంచన చేసుకోవాలనుకొంటే ప్రతిపక్షాలకు అభ్యంతరం లేదు. కానీ ప్రజలను కూడా మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తే చివరికి నష్టపోయేది వారు కాదు తామే అని వైసీపీ గ్రహిస్తే మంచిది.



