టిడిపి యువనేత నారా లోకేష్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. అంటే ఆరు నెలలుగా పాదయాత్ర చేస్తూనే ఉన్నారన్న మాట. మొదట ప్రభుత్వం పోలీసులతో అడ్డుకొని పరీక్ష పెడితే దానిని తట్టుకొని, తొడగొట్టి సవాలు చేసి మరీ అధిగమించి ముందుకు సాగారు.
ఆ తర్వాత నాలుగు నెలలపాటు రాయలసీమలో ఎండలు, వేడి, వడగాడ్పులతో ప్రకృతి పరీక్ష పెట్టింది. అప్పుడైనా నారా లోకేష్ వెనక్కు తగ్గుతారనుకొంటే ముందుకే సాగారు. ప్రభుత్వం, ప్రకృతీ రెండు పట్టిన పరీక్షలలో విజయం సాధించి నేటితో 150 రోజులు పాదయాత్ర పూర్తిచేశారు. నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గంలో శనివారం నారా లోకేష్ 150 రోజులు పాదయాత్ర పూర్తి చేశారు.
ఈ 150 రోజులలో నారా లోకేష్ రాయలసీమ జిల్లాలలో అన్ని నియోజకవర్గాల గుండా పాదయాత్ర చేశారు. ప్రతీ వంద కిమీలకు ఆయా నియోజకవర్గాలకు ఇచ్చిన హామీలను శిలాఫలకాల సాక్షిగా ప్రజలకు సమర్పించి ముందుకు సాగుతున్నారు.
మూడు రాజధానులు వ్యూహంతో రాయలసీమ జిల్లాల ప్రజలను రెచ్చగొట్టి టిడిపి నేతలను అడుగుపెట్టనీయకుండా చేయాలని వైసీపీ దురాలోచన చేస్తే, సీమజిల్లాలోనే ప్రజలు నారా లోకేష్కు నీరాజనాలు పట్టారు. ఆయనతో తమ కష్టసుఖాలు కలబోసుకొన్నారు. ప్రజల సమస్యలని, వారి కష్టాలను ఇంత దగ్గర నుంచి చూస్తున్న నారా లోకేష్ వాటన్నిటినీ ఎప్పటికప్పుడు రికార్డ్ చేయిస్తూ, వాటికి టిడిపి మ్యానిఫెస్టో ద్వారా శాశ్విత పరిష్కారాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఊహించిన దానికంటే యువగళం పాదయాత్రకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నందుకు టిడిపి సంతోషిస్తుంటే, ఎక్కువగా పార్టీ కార్యాలయానికే పరిమితమయ్యుండే నారా లోకేష్ ఆహాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి అనవసరంగా రెచ్చగొట్టి యువగళం పాదయాత్ర మొదలుపెట్టించినందుకు వైసీపీ నేతలు తమను తాము నిందించుకొంటున్నారు.
నారా లోకేష్ ఒక్కో నియోజకవర్గంలో తమ అవినీతి, అక్రమాల చిట్టాను సెల్ఫీ ఫోటోలు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లతో సహా బయటపెడుతుంటే అందరూ ఆయనకు దణ్ణం పెట్టేస్తున్నారు తమ నియోజకవర్గం నుంచి తొందరగా ముందుకు సాగిపోవాలని. బహుశః వైసీపీ నేతలెవరూ నారా లోకేష్ ఇంత రాటుతేలిపోతారని ఊహించి ఉండరు.
అయితే ఇంతవరకు నారా లోకేష్ టీజర్ మాత్రమే చూపించారు. ‘హూ కిల్డ్ బాబాయ్?’ అంటూ కడప కంచుకోటలో నిలబడి ప్రశ్నించిన నారా లోకేష్, రేపు తాడేపల్లిలో అడుపెట్టినప్పుడు చూపించబోయే ట్రైలర్ ఎలా ఉంటుందో?



