మోడీ ప్రభుత్వం కూడా అభద్రతాభావంతో ఉందా?

Narendra Modi Govt No Confidence Motionకేంద్ర ఎన్నికల కమీషన్‌ (ఈసీ) ఓ రాజ్యాంగ బద్దమైన స్వతంత్ర సంస్థ…. అనే అందరూ భావిస్తుంటారు. అది వాస్తవం కూడా. అయితే దానిపై రాజకీయ ఒత్తిళ్ళు, ఆ ప్రభావం లేవా అంటే ఉన్నాయని అందరికీ తెలుసు. ఎన్నికల ప్రక్రియలో జరిగే అనేక అవకతవకలను చూసి చూడన్నట్లు ఊరుకోవడమే ఇందుకు చిన్న ఉదాహరణ. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఈసీ మీద రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ కొన్ని అగ్రదేశాల కంటే కూడా మన ఈసీ అద్భుతంగా పనిచేస్తోందనేది కూడా వాస్తవం.

రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈసీ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, మరింత సమర్ధంగా పనిచేయాలని కోరుకొంటాయి. కానీ అవే పార్టీ అధికారంలో రాగానే ఈసీ తమ కనుసన్నలలో పనిచేయాలనుకొంటాయి. అంటే ఈసీ సక్రమంగా పనిచేస్తే అది ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయపార్టీలను కూడా కాపాడగలదని అర్దమవుతోంది. అయితే రాజకీయ పార్టీల ఈ ద్వందవైఖరి కారణంగా ఈసీ నానాటికీ బలహీనపడుతోంది.

ADVERTISEMENT

ఈ ఏడాది చివరిలోగా 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, 2024 ఏప్రిల్లోగా లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈసీ పనితీరును ప్రభావితం చేయగల ఓ బిల్లును నిన్న రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈసీలో కమీషనర్లని ఎంపిక చేసే కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ఆ స్థానంలో ఓ కేంద్రమంత్రిని నియమించాలని ఆ బిల్లులో ప్రతిపాదించింది. ప్రధానమంత్రి నేతృత్వంలో ఏర్పాటయ్యే కమిటీలో లోక్‌సభ విపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన ఓ కేంద్రమంత్రి దానిలో సభ్యులుగా ఉంటారు.

ఈసీలో కమీషనర్లను కేంద్రప్రభుత్వమే నిర్ణయిస్తున్నప్పుడు, తమకు అనుకూలంగా ఉండేవారిని నియమించుకొంటుందని వేరే చెప్పక్కరలేదు. అంటే వారి ద్వారా దేశంలో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తన కనుసన్నలలో నడిపించే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చు.

కేంద్రానికి పార్లమెంటులో తగినంత బలం ఉంది కనుక ఆమోదింపజేసుకోవడం ఖాయమే. కనుక ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు అరణ్యరోదనగానే మిగిలిపోవడం కూడా ఖాయమే.

దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, ఒకే ఒక్క ఓటుతో అధికారం కోల్పోయారు. ఆయన తలుచుకొంటే ఒకరు కాదు… 20-30 మంది ప్రతిపక్ష ఎంపీలను తమవైపు తిప్పుకోగలరు. కానీ ఆయన నైతిక విలువలకు కట్టుబడి ఒక్క ఎంపీని కూడా తమవైపు తిప్పుకోవడానికి నిరాకరించడంతో ఆయన ప్రభుత్వం పడిపోయింది. నైతిక విలువలకు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఆయన ఇచ్చిన గౌరవం అది.

కానీ అదే బిజెపి పార్టీ నేడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఈ బిల్లును పార్లమెంటు చేత ఆమోదింపజేసుకోబోతోంది. పైగా తన నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకొంటోంది కూడా. న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యం గురించి పార్లమెంటులో ఉపన్యాసాలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఈవిదంగా చేస్తుండటం చాలా బాధాకరమే.

నిజానికి దేశంలో కాంగ్రెస్‌ బలహీనపడి ఉంది. అందుకే అది ‘ఇండియా కూటమి’తో కలిసి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రయత్నిస్తోంది. కానీ ఇండియా కూటమిని దేశప్రజలు నమ్మే పరిస్థితి లేదని ప్రధాని నరేంద్రమోడీయే పార్లమెంటులో చెప్పుకొన్నారు. మరి అటువంటప్పుడు ఈసీని తన గుప్పెట్లో ఎందుకు పెట్టుకోవాలనుకొంటున్నారు? అంటే మోడీ ప్రభుత్వం కూడా అభద్రతాభావంతో ఉందా?అంటే మళ్ళీ బారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వస్తామని బిజెపి చెప్పుకొంటున్న మాటలు నిజం కావా?

ADVERTISEMENT
Latest Stories