అది లోక్‌సభ రద్దు-ముందస్తు ఎన్నికలకు మరో సంకేతమేనా?

Narendra Modi Govt No Confidence Motionఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం హటాత్తుగా ప్రకటించడంతో రాజకీయ పార్టీలన్నీ ఉలిక్కిపడ్డాయి. బహుశః లోక్‌సభని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో మోడీ ప్రభుత్వం అటువంటిదే నేడు మరో సంకేతం ఇచ్చింది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిన్నట్లు తాజా సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది.

ADVERTISEMENT

లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను కలిపి నిర్వహించడం వలన ఎన్నికల నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని మోడీ ప్రభుత్వం చాలా కాలంగా చెపుతోంది. అయితే జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే, రాజ్యాంగంలోని 5 ప్రధాన సవరణలు చేయాల్సి ఉంటుందని ఇటీవలే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ చరణ్‌ మేఘవాల్ రాజ్యసభలో చెప్పడం గమనిస్తే ఆ చట్ట సవరణల కోసమేపార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సందేహం కలుగుతోంది.

న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా, జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యంతరాలను అధిగమించడానికే చట్టసవరణలు చేసి, రాంనాధ్ కోవింద్ కమిటీ చేత ‘మమ’ అనిపించేసి లోక్‌సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు మోడీ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. అంటే పద్దతిగానే అన్ని ఏర్పాట్లు చేస్తోందన్న మాట!

ఈ ఏడాది డిసెంబర్‌లోగా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, మిజోరాం రాష్ట్రాలకు, 2024 మార్చి-ఏప్రిల్ నెలల్లో ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రాలతో సహా మరో మూడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి.

కనుక ఈ పది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది.

ADVERTISEMENT
Latest Stories