ఎలాంటి సమాచారం లేకుండా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి సంచలనం సృష్టించిన ప్రధాని నరేంద్ర మోడీ, కొత్త సంవత్సరం కానుకగా మరిన్ని విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారని మీడియా వర్గాల వేదికగా హల్చల్ చేస్తోన్న సమాచారం. ‘క్యాష్ లెస్’ ఎకానమీ కోసం మోడీ మరికొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని, డిసెంబర్ 31వ తేదీతో ముగియనున్న గడువు తర్వాత ఈ ప్రకటన ఉంటుందని, నల్లధనంపై చావోరేవో లక్ష్యంగా ప్రధాని అడుగులు పడనున్నాయని తెలుస్తోంది.
2017, జనవరి ఒకటో తేదీ నుంచి బ్యాంకు లావాదేవీలపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సేవింగ్స్ ఖాతా నుంచి ఒక రోజుకు గరిష్టంగా 50 వేలు, కరెంట్ అకౌంట్ నుంచి రోజుకు లక్ష వరకు మాత్రమే డ్రా చేసుకునేలా నగదుపై నియంత్రణ పెట్టనున్నట్లు.., అలాగే ‘బ్యాంక్ ట్రాన్సాక్షన్ టాక్స్’ పేరుతో నగదుతో కూడిన లావాదేవీలపై పన్నులు కూడా విధించాలని… తద్వారా వినియోగదారులను ‘క్యాష్ లెస్’ విధానానికి అలవాటు చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయట.
అయితే నగదును బ్యాంకులలో కాక, ఇంట్లో ఉంచుకోవాలనుకున్నా కూడా కుదరని విధంగా సరికొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానున్నట్లుగా ఈ కధనాల సారాంశం. నగదును తమతో పాటు ఉంచుకునే పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పరిమితం చేస్తారని తెలుస్తోంది. ప్రజలు అలవాటు పడడానికి కొంతకాలం పట్టవచ్చు గానీ, దీని వలన దేశ ఆర్ధిక వ్యవస్థ బలపడుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఆర్ధిక సంవత్సరంగా పరిగణించే ‘ఏప్రిల్ టు మార్చి’ కాలాన్ని ‘జనవరి టు డిసెంబర్’గా మార్చనున్నారని ప్రచారం జరుగుతోంది.



