కేసీఆర్‌ నాతో కూడా బేరాసారాలు చేశారు కానీ ….

Narendra-Modi-KCRప్రధాని నరేంద్రమోడీ నిన్న నిజామాబాద్‌ బహిరంగసభలో తెలంగాణ సిఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బీజేపీ 48 సీట్లు గెలుచుకోవడంతో బిఆర్ఎస్ (56) మేయర్ పదవి సొంతంగా దక్కించుకోలేకపోయింది. దాంతో కేసీఆర్‌ వెంటనే ఢిల్లీకి వచ్చి తనను కలిసి బేరసారాలు చేసేందుకు ప్రయత్నించారని ప్రధాని నరేంద్రమోడీ కుండబద్దలు కొట్టారు.

ADVERTISEMENT

ఎన్డీయే కూటమిలో చేరుతానని, మేయర్ పదవి బీజేపీకి ఇస్తామని కేసీఆర్‌ బేరసారాలు చేశారని మోడీ చెప్పారు. కానీ తాను రెండు ప్రతిపాదనలను నిర్ద్వందంగా తిరస్కరించానని చెప్పారు. తాను తెలంగాణ కోసం చాలా చేశానని కనుక ఇప్పుడు తన కుమారుడు కేటీఆర్‌ని ముఖ్యమంత్రి చేయాలనుకొంటున్నానని, తనని ఆశీర్వదించాలని కేసీఆర్‌ కోరారని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అయితే తెలంగాణ ఏమీ మీ సొంత సామ్రాజ్యం కాదు కదా…. వంశఫారంపర్యంగా పాలించేందుకు?ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వారే అధికారంలోకి వస్తారని నేను చెప్పాను.

అప్పుడే కేసీఆర్‌ మొహం మీదే ఆయన అవినీతి చిట్టాను కూడా చెప్పేశాను. అప్పటి నుంచే కేసీఆర్‌ ఢిల్లీ రావడం మానేశారు. కేసీఆర్‌ నాకు ఎదురుపడలేక, ధైర్యంగా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేక నేను ఎప్పుడు తెలంగాణకు వచ్చినా మొహం చాటేస్తున్నారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ ఏర్పాటైనందున రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అన్నివిదాల తోడ్పడుతూనే ఉంది. కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను పూర్తి చేయించాము. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌, ఆయన, కుమారుడు, కూతురు, మేనల్లుడు అందరూ అవినీతికి పాల్పడుతూ ధనవంతులయ్యారు,”అని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రాభివృద్ధి విషయంలో కేసీఆర్‌ తపన, నిబద్దత, చిత్తశుద్ధి, దూరదృష్టిని ఎవరూ వేలెత్తి చూపలేరు. కానీ ఆ అభివృద్ధి పనులతోనే భారీగా సంపాదించుకొన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. కేసీఆర్‌ రాజకీయ చాణక్యం పేరుతో ఏ ఎండకు ఆ గొడుగు పడతారని అందరికీ తెలుసు. అదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ బయటపెట్టారు.

ప్రధాని అంతటివాడు రాష్ట్రానికి వచ్చి పచ్చి అబద్దాలు చెపుతున్నారంటూ బిఆర్ఎస్ నేతలు వాదించవచ్చు. కానీ కేసీఆర్‌ ఇంతవరకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, త్రిదండి చిన్న జీయర్ స్వామి, వామపక్షాలతో, కర్ణాటకలోని (జెడిఎస్)కుమారస్వామితో, ఇంకా దేశంలోని వివిద పార్టీల నేతలతో వ్యవహరించిన తీరు గమనిస్తే ప్రధాని ఆరోపణలు నిజమే అని అర్దమవుతుంది.

అయితే కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నారని తెలిసి ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించలేదు?అనే ప్రశ్నకు ఎవరూ బయటకు చెప్పడానికి ఇష్టపడని ఓ సమాధానం ఒకటుంది. ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నప్పుడే వారి జుట్టు కేంద్రం గుప్పెట్లోకి వస్తుంది తప్ప నిజాయితీపరులని ఎవరూ ఏమీ చేయలేరు. అవినీతికి పాల్పడినవారే కేంద్రం పట్ల విధేయంగా అణిగి మణిగి ఉంటారు. ఇందుకు ప్రత్యక్షసాక్ష్యం ఏపీలోనే ఉంది కదా?

చివరిగా ఒక మాట. ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోడీని తీవ్రంగా విమర్శించినందుకు, ఇప్పుడు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో అందరూ చూస్తున్నారు. కేసీఆర్‌ అంతకంటే చాలా చాలా ఎక్కువగానే ప్రధాని నరేంద్రమోడీని విమర్శిస్తున్నారు. అవమానిస్తున్నారు. కనుక భవిష్యత్‌లో ఆయనకు ఇటువంటి కష్టాలు తప్పకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories