రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచేందుకు ఆచరణ సాధ్యం కాని, ప్రభుత్వంపై చాలా భారంపడే వరాలు, సంక్షేమ పధకాలను ప్రకటిస్తుండటంతో దేశం, రాష్ట్రాలు కూడా శ్రీలంకలా దివాళా తీసే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం, ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కనుక రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వరాలు ప్రకటించకుండా నిషేదించాలని, అవసరమైతే దాని కోసం పార్లమెంట్లో చట్టం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం బుదవారం వాటిపై విచారణ చేపట్టినప్పుడు, ఎన్నికలలో వరాలు, సంక్షేమ పధకాలపై మరింత లోతుగా చర్చ జరిపాల్సి ఉందని చెపుతూ దీని కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.
అన్ని విదాల అభివృద్ధి చెంది, అక్షయపాత్ర వంటి హైదరాబాద్ కలిగిన ధనిక రాష్ట్రమైన తెలంగాణయే అప్పులు పుట్టకపోవడంతో ఆల్లాడిపోతోంది. ఇక ఏపీకి ఎటువంటి ఆర్ధిక వనరులు లేకపోయినా, రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు లేకపోయినా గత మూడేళ్ళుగా జగన్ ప్రభుత్వం సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు పప్పుబెల్లాలలాగా పంచిపెట్టేస్తూ ఓటు బ్యాంకును బలపరుచుకొంటోంది. వాటి కోసం ఎడాపెడా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. కనుక ప్రతిపక్షాలు, మీడియా, చాలా మంది ప్రజలు కూడా జగన్ ప్రభుత్వం తీరును విమర్శిస్తున్నారు.
సరిగ్గా ఇటువంటి సమయంలో సంక్షేమ పధకాలపై సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టింది. దేశంలో పలు ప్రాంతీయ పార్టీలు ఓటర్లకు సంక్షేమ పధకాల ఎర వేసి అధికారంలోకి వచ్చినందున వాటి అమలును గట్టిగా సమర్ధిస్తున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వ సంక్షేమ విధానంపై విమర్శలే తప్ప ఎన్నడూ ఈవిదంగా మద్దతు లభించలేదు. కనుక అందివచ్చిన ఈ అవకాశాన్ని అబగా అందుకొనేందుకు వైసీపీ తరపున ఎంపీ విజయసాయి రెడ్డి ఈ కేసులో చేరేందుకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.
సమాజంలో నిరుపేద ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలదే. కానీ ఎవరికి సాయం అవసరం ఎవరికి అవసరం లేదు? అని గుర్తించడానికి విచక్షణ చాలా అవసరం. ఉదాహరణకు వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నిరుపేదలకు ప్రభుత్వం సాయం చేయడం చాలా అవసరం. కానీ అమ్మఒడి, వాహనమిత్ర అంటూ విచ్చలవిడిగా అప్పులు చేసి డబ్బు పంచిపెట్టడమే తప్పు. ఎందుకంటే నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆటోలు, క్యాబ్లు నడుపుకొనేవారు తమ కాళ్ళపై తాము నిలబడి కుటుంబాలను పోషించుకొంటున్నారు.
ఇలాగే అనేక పధకాల ద్వారా అవసరం లేనివారికి జగన్ ప్రభుత్వం లక్షలకోట్లు పంచిపెడుతూ వారిని వైసీపీ ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. గడప గడపకి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్దిదారులకు ఇదే విషయం గుర్తుచేస్తూ వైసీపీకి ఓటు వేయాలని కోరుతుండటమే ఇందుకు నిదర్శనం. అప్పులు చేసి ప్రజల భారం వేస్తూ మళ్ళీ ప్రజలను ఉద్దరిస్తున్నామని చెప్పుకోవడం వైసీపీకే చెల్లు!



