ఆంధ్రప్రదేశ్లో టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇన్నాళ్ళు జగన్ చెప్పిన్నట్లు ఆడుతూ ఇటు టిడిపి, జనసేనలను, అటు ప్రజలను కూడా నానా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డితో సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఉద్వాసన కార్యక్రమం మొదలైంది. ముందుగా జవహర్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు వేటు వేశారు.
ఆయనను ఆ పదవిలో నుంచి తప్పించి ఆయన స్థానంలో 1987 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసుకున్నారు. కొద్ది సేపటి క్రితమే ఆయన సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు జవహార్ రెడ్డి సెలవుపై వెళ్ళిపోయారు. ఈ నెలాఖరున తిరిగి రాగానే పదవీ విరమణ చేయబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత జగన్ హయాంలో ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, జారీ చేసిన వివాదాస్పద జీవోలు, విశాఖలో భూకబ్జాలపై ఆయనపై చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.
ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పటి వరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతక శాఖ ప్రధాన కార్యదర్శిగా చేశారు. వివాదాలకు, రాజకీయాలకు దూరంగా ఉండే ఆయనకు చాలా సమర్ధుడైన అధికారిగా పేరుంది. కానీ అటువంటి సమర్ధులు జగన్కు అవసరం లేదు కనుక ఆయన సేవలను ఉపయోగించుకోలేదు.
కానీ రాష్ట్ర విభజనకు ముందు తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో సమర్ధులు ఎవరో, ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. కనుక సమర్ధులైన అధికారులను ఏరికోరి పదవీ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనితీరు ఏవిదంగా ఉంటుందో, ఆయన తమ నుంచి ఏమి ఆశిస్తారో వారికి కూడా తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయక మునుపే సీఆర్డీఏ అధికారులు కూడా మేల్కొని గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చకచకా శుభ్రం చేయిస్తున్నారు.




