KCR KTR

కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీకి కూడా 2024 సంవత్సరం చాలా చేదు అనుభవాలను మిగిల్చింది. కనీసం 2025లోనైనా మళ్ళీ మంచి రోజులు వస్తాయా? అంటే అనుమానమే. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా 1 రేసింగ్ రెండు కేసులు చాలు వారి రాజకీయ జీవితాలను తారుమారు చేయడానికి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో అరడజను కేసులు వారి కోసం సిద్దం చేస్తోంది. కనుక కొత్త సంవత్సరంలో కూడా సమస్యలు తప్పేలా లేవు.

ఫార్ములా 1 రేసింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ని ఈ నెల 30 వరకు అరెస్ట్‌ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుకి లోబడి 30 వరకు ఆగినా ఆ తర్వాత ఎప్పుడైనా ఏసీబీ అధికారులు కేటీఆర్‌ని అరెస్ట్‌ చేయక మానరు.

Also Read – ఇది జగన్‌ ఎఫెక్టేనా?

ఈ కేసులో ఈడీ కూడా జోక్యం చేసుకొని కేటీఆర్‌ మీద కేసు నమోదు చేసింది. అదే ఇప్పుడు కేటీఆర్‌తో పాటు కేసీఆర్‌ మెడకు కూడా ఉచ్చులా చుట్టుకునే ప్రమాదం ఉంది. రూ.10 కోట్లకు మించి (ప్రభుత్వాలు)విదేశాలకు నగదు బదిలీ చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి తప్పనిసరి.

ఈ నిబందనని కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోకుండా బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.45.71 కోట్లు ఫార్ములా 1 రేసింగ్ నిర్వాహకులకు పంపింది. ఇది ఫెమా, పీఎంఎల్ చట్టాల ఉల్లంఘించడంగానే పరిగణించి ఈడీ కేసు నమోదు చేసింది.

Also Read – దావోస్‌ సదస్సులో ముఖ్యమంత్రుల ఐఖ్యతారాగం.. శభాష్!

పదవీ, అధికారం చేతిలో ఉన్నప్పుడు ఈ భూప్రపంచంలో నా అంతటివాడు లేడని, ఏం చేసినా చెల్లుతుందని నాయకులు అనుకోవడం వలననే ఇటువంటి తప్పులు చేస్తుంటారు.

ఇదే ధైర్యంతో కేసీఆర్‌ కూడా ఇదేవిదంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు పాల్పడ్డారని చెప్పవచ్చు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్‌ తిరుగులేని అధికారం అనుభవించారు. ఆ ఊపులోనే ఇద్దరూ గీత దాటి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు.

Also Read – కూటమిలో నేతలే వైసీపీకి నిప్పు అందిస్తున్నారా?

ఈ కేసులో కేటీఆర్‌ అరెస్ట్‌ అనివార్యమే.. కానీ ఎప్పుడు?ఎన్ని రోజులు జైల్లో ఉంటారనేది మాత్రమే తెలియాల్సి ఉంది.

కేసీఆర్‌ ఇది ముందే పసిగట్టారు కనుకనే కూతురు కల్వకుంట్ల కవితని మళ్ళీ ‘యాక్టివ్‌గా’ చేసి ఉండొచ్చు. ఈ కేసుల భయం వల్లనో లేదా అమెరికాలో చదువుకుంటున్న మనవడి దగ్గర కొన్ని రోజులు గడిపి రావాలనే ఉద్దేశ్యంతోనో కేసీఆర్‌ త్వరలో అమెరికా బయలుదేరి వెళ్ళబోతున్నారని సమాచారం.

కనుక కొడుకు కేటీఆర్‌ అరెస్ట్‌ అయ్యి జైలుకి వెళితే, కేసీఆర్‌ అమెరికా వెళ్ళి సేద తీరుతారా లేదా పర్యటన రద్దు చేసుకొని రంగంలో దిగుతారా?అనేది త్వరలో తెలుస్తుంది.

ఒకవేళ ఈ కేసులు ఆయన మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని గ్రహిస్తే ఆయన అమెరికా వెళ్ళేందుకే మొగ్గు చూపవచ్చు.

అప్పుడు బిఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు?అంటే హరీష్ రావు లేదా కల్వకుంట్ల కవిత మాత్రమే కనిపిస్తున్నారు.

ఒకవేళ కల్వకుంట్ల కవితకి అప్పగిస్తే హరీష్ రావు ‘మనోభావాలు’ దెబ్బ తినే ప్రమాదం, పార్టీ చీలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ హరీష్ రావుకి అప్పగిస్తే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్‌ కుటుంబం చేతిలో నుంచి ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతుంది. అది ఇంకా ప్రమాదం.




కనుక ఏవిదంగా చూసినా కేసీఆర్‌, కేటీఆర్‌, బిఆర్ఎస్ పార్టీలకి కొత్త సంవత్సరం అనేక సమస్యలతో ప్రారంభం కాబోతున్నట్లు కనిపిస్తోంది.