హైదరాబాద్ నగరాన్ని ఇలా కాపాడారు… కాపాడుతున్నారు..!

Hyderabad ISIS, Hyderabad ISIS Suspects, Hyderabad ISIS Arrested, Hyderabad ISIS NIA, Hyderabad ISIS Old City, Hyderabad ISIS Terror Attackభాగ్యనగరి హైదరాబాదులో పెను విధ్వంసానికి కుట్ర పన్నిన ఐఎస్ సానుభూతిపరులుగా భావిస్తున్న ఉగ్రవాదులు దాదాపుగా రెండేళ్లుగా పథక రచన చేస్తున్నారు. దీనిపై నాడే కీలక సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో దానిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. 2014లో ప్రారంభమైన ఈ నిఘా నాన్ స్టాప్ గా కొనసాగింది. అరెస్టైన ఐదుగురు ఉగ్రవాదుల పేర్లను నిర్ధారణ చేసుకున్న ఐబీ… వారికి సంబంధించిన ప్రతి చిన్న కదలికపైనా పూర్తి స్థాయిలో నిఘా వేసింది. ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఉగ్రవాదులు సంచరించిన అన్ని ప్రాంతాల్లో వారి వెంటే నడిచింది.

ఉగ్రవాదులకు ఏ మాత్రం అనుమానం రాకుండా వారి గూడుపుఠాణికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించింది. అయితే అప్పటికప్పుడే వారిని అరెస్ట్ చేసే అవకాశాలున్నా… సరైన సమయం కోసం ఐబీ చూసింది. ఈ క్రమంలో నగరంలో భారీ విధ్వంసాన్ని సృష్టించేందుకు ఉగ్రవాదుల సన్నాహాలు ముమ్మరమైన క్రమంలో వెనువెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులను అప్రమత్తం చేసింది. ఐబీ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ గత నెల 22న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంతేకాకుండా ఐబీ ఇచ్చిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్ఐఏ… ఈ నెల 28న సోదాల కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకుంది. కోర్టు నుంచి అదే రోజు గ్రీన్ సిగ్నల్ రాగా.. ఆ మరునాడు రంగంలోకి దిగిపోయింది.

ADVERTISEMENT

ఎంపిక చేసుకున్న పోలీసు సిబ్బందిని ఏకకాలంలో రంగంలోకి దించిన ఎన్ఐఏ… తాము అనుకున్న ఐదుగురు ఉగ్రవాదులతో పాటు మరో ఆరుగురిని అనుమానితుల కింద అరెస్ట్ చేసింది. అయితే మిగిలిన ఆరుగురికి ఈ ఉగ్ర పథకంలో సంబంధం లేదని తేలడంతో వారిని వదిలేసింది. మిగిలిన ఐదుగురిని కోర్టులో హాజరుపరచింది. వెరసి ఐబీ అధికారులు రెండేళ్ల పాటు పెట్టిన నిఘా.. భాగ్యనగరిలో ఉగ్రవాదుల పెను విధ్వంసాన్ని నివారించింది.

ఇదిలా ఉంటే, రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కావడంతో, మక్కా మసీదుతో పాటు అన్ని మసీదుల్లో వేలాది మంది ముస్లింల సామూహిక ప్రార్థనలతో నగరంలోని పాతబస్తీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల వ్యూహాలకు సంబంధించి సమగ్ర సమాచారం వెల్లడైనా… ఇంకా వెల్లడి కాని పథకాలేమైనా ఉన్నాయేమోనన్న అనుమానాలు పోలీసులను పట్టి పీడిస్తున్నాయి. అరెస్టైన ఉగ్రవాదులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే తప్పించి ఈ విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలగే అవకాశం లేదు.

అదే సమయంలో చార్మినార్ కు సమీపంలోని హిందూ ఆలయం భాగ్యలక్ష్మీ టెంపుల్ లోనూ హిందువులు భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ పరిస్థితి కట్టుతప్పుతుందోనన్న భయంతో పోలీసులు పెద్ద ఎత్తున సాయుధ బలగాలను రంగంలోకి దింపారు. పాతబస్తీ పరిధిలోని మక్కా మసీదు సహా మరో 9 మసీదులు, భాగ్యలక్ష్మి టెంపుల్ పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. మసీదు, ఆలయాల వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఓ వైపు ముస్లింల ప్రార్థనలు, మరోవైపు హిందువుల పూజలు, ఇంకోవైపు ఉగ్రవాదుల వ్యూహాలపై పోలీసుల అనుమానాలు… వెరసి పాతబస్తీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories