ఒక ఇంటి నిర్మాణం మద్యలో ఆగిపోతే దాని కోసం చేసిన అప్పులు, ఖర్చు, ఆలస్యం అయితే పెరిగే నిర్మాణ వ్యయం వలన ఆ గృహస్థుకి ఎంతో నష్టం జరుగుతుంది. ఆ లెక్కన 5 ఏళ్ళపాటు అమరావతి రాజధాని నిర్మాణపనులు నిలిచిపోతే ఎన్ని కోట్లు నష్టం జరిగి ఉంటుంది.
రాజధాని లేకపోగా, మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం వలన ఎన్ని పరిశ్రమలు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి? ఆ కారణంగా రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు కోల్పోయింది? రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లేకపోవడం వలన ఎన్ని లక్షల మంది యువతీయువకులు వలసలు వెళ్ళిపోయారు? అని ఆలోచిస్తే జగన్ నిర్వాకం వలన రాష్ట్రానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదని అర్దమవుతుంది.
జగన్ వెర్రి ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తున్నారని తెలిసి ఉన్నా ప్రధాని నరేంద్రమోడీ ఆయనను మందలించి దారినపెట్టకపోవడం కూడా తప్పే. అయితే జరిగిన నష్టం, జరిగిన తప్పులు జరిగిపోయాయి. ఇప్పుడు వాటి గురించి ఎంత ఆలోచించి బాధపడినా ప్రయోజనం ఉండదు.
కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ అమరావతి నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పనిలో పనిగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్లతో మాట్లాడి అమరావతి, పోలవరం నిర్మాణానికి బడ్జెట్లో తగినంత నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
వాటిపై సానుకూలంగా స్పందించిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో అమరావతికి రూ.15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు పనులకు తగినన్ని నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. బడ్జెట్లో కాకుండా అదనంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ఆర్ధిక, పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన నిధులు, సహాయసహకారాలు అందించి తోడ్పడుతామని చెప్పారు.
ఇదివరకు జగన్ సిఎంగా ఉన్నప్పుడు కూడా మోడీ ప్రభుత్వం ఆయనకు ఉదారంగానే అప్పులు ఇప్పించింది. కానీ అడగందే అమ్మైనా అన్నం పెట్టదన్నట్లు జగన్ రాజధాని, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిధులు, సహాయసహకారాలు కోరే బదులు సంక్షేమ పధకాలకు అప్పులు, తన కేసులు వివేకా హత్య కేసులో ఉపశమనం మాత్రమే కోరుకున్నారు. కనుక అవే ఇచ్చింది. వాటితో ఆయన రాజకీయ లబ్ధిపొందాలనుకున్నారు. కానీ ఎన్నికలలో ఓడిపోయారు. అంటే జగన్ ధోరణి వలన ఆయన స్వయంగా నష్టపోవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలా నష్టపోయిందని స్పష్టం అవుతోంది.
జగన్ ప్రాధాన్యతలు వేరు, సిఎం చంద్రబాబు నాయుడి ప్రాధ్యాన్యతలు వేరు. అందుకే ఇప్పుడు అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తోందని చెప్పవచ్చు.




