మళ్ళీ లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బిజెపిని వ్యతిరేకిస్తున్న విపక్ష పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు సమావేశాలు పెట్టుకొంటూ కూటమి ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల ఢిల్లీ, పాట్నాలలో సమావేశమైన తర్వాత మళ్ళీ ఈ నెల 17,18 తేదీలలో బెంగళూరులో సమావేశం కాబోతున్నారు.
ఈ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ కూడా హాజరవుతోంది. ఇది వరకు కాంగ్రెస్ నేతృత్వంలో మిత్రపక్షాలన్నీ కలిసి యూపీయే కూటమిగా ఏర్పడి పనిచేసేవి. కానీ విపకక్షాలు ఏర్పాటు చేస్తున్న కూటమిలో కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉంటోంది.
ఒకవేళ అన్ని పార్టీలు ఎన్నికల వరకు కలిసి ఉండి, ప్రధాని అభ్యర్ధిని ప్రకటించగలిగితే వాటిపై దేశప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. కానీ ప్రధాని అభ్యర్ధిని ప్రకటించిన మరుక్షణమే వారి కూటమి చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉంది. వారి కూటమిలో ముఖ్యంగా ముగ్గురు ప్రధానమంత్రి రేసులో ఉన్నారు. 1.రాహుల్ గాంధీ, 2. మమతా బెనర్జీ, 3.నితీశ్ కుమార్. వీరు ముగ్గురూ కాకుండా మరికొందరు కూడా ఉన్నారు. కానీ వీరు ముగ్గురిలో ఒకరిని ఖరారు చేసుకోగలిగినా వారి కూటమి నిలబడే అవకాశం ఉంటుంది.
ఆదివారం ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే…’ అంటూ మాట్లాడారు. అంటే రాహుల్ గాంధీ లేదా ప్రియాంకా గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ నేతృత్వంలో మిత్రపక్షాలు పనిచేస్తాయని చెపుతున్నట్లు భావించవచ్చు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాము ప్రధాని రేసులో ఉన్నట్లు ఎప్పటి నుంచో తమ పార్టీ నేతల చేత చెప్పిస్తున్నారు. కనుక వారు రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయరని భావించవచ్చు. అలాగే వారిరువురూ కూడా ఒకరి నేతృత్వంలో మరొకరు పనిచేయడానికి ఇష్టపడరని వేరే చెప్పక్కరలేదు.
మరి ఇంతమంది ప్రధాని పదవి రేసులో ఉన్నప్పుడు అందరూ కలిసి ఏవిదంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు?అని ఆలోచిస్తే వారు ఏర్పాటు చేయాలనుకొంటున్న కూటమి ఓ కప్పల తక్కెడ వంటిదని అర్దమవుతోంది.
కనుక వారు మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి ముందుగా ప్రధాని అభ్యర్ధి ఎవరు?అనే ఓకే ఒక్క అంశంపై చర్చించుకొని అందరూ ఓ అంగీకారానికి రాగలిగితే వారి సమావేశాలు అర్దవంతంగా ఉంటాయి లేకపోతే ఎన్నికల వరకు అందరికీ ఇదో కాలక్షేపం అనుకోవచ్చు.



