బిహార్‌ రాజకీయాలతో ఏపీకి సంబంధం.. ఎలా అంటే…

Nitish Kumar YS Sharmila

లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని ఓడించి నరేంద్ర మోడీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న 28 పార్టీలు కలిసి ఆర్భాటంగా ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ జారీ కాక ముందే ఇండియా కూటమి విచ్ఛిన్నం అయిపోతోంది.

బిహార్‌కు చెందిన జెడీ(యు) అధినేత, ఆ రాష్ట్ర సిఎం నితీష్ కుమార్‌ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మళ్ళీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే జత కట్టేందుకు సిద్దమవుతున్నారు.

ADVERTISEMENT

ప్రస్తుతం బిహార్‌లో నితీష్ కుమార్‌ నేతృత్వంలో జెడియు, ఆర్‌జెడీ (లాలూ ప్రసాద్ యాదవ్), కాంగ్రెస్‌ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ నితీష్ కుమార్‌ కాంగ్రెస్‌, ఆర్‌జెడీలకు కటీఫ్ చెప్పేసి, నేడు తన పదవికి రాజీనామా చేసి, మళ్ళీ వెంటనే బీజేపీతో కలిసి నేటి సాయంత్రమే మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

బిహార్‌లో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు తెలుగు ప్రజలకు అంత ఆసక్తి కలిగించకపోవచ్చు. వాటితో మనకేమిటి సంబంధం?అని అనుకోవచ్చు. కానీ సబంధం ఉంది.

ఏవిదంగా అంటే ఇవి లోక్‌సభ ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలలో అత్యధిక ఎంపీ స్థానాలున్న రాష్ట్రాలలో బిహార్‌ (40) కూడా ఒకటి.

ఇప్పటికే యూపీ, ఎంపీ, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు బిహార్‌లో మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. నితీష్ కుమార్‌, బీజేపీతో కలిస్తే బిహార్‌లో ఎంపీ సీట్లు అత్యధికంగా గెలుచుకోవడం ఖాయమే.

ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ మరింత బలపడింది కనుక లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు మరింత పెరిగాయి.

ఇదే సమయంలో ఇండియా కూటమి బలహీనపడుతోంది. కనుక లోక్‌సభ ఎన్నికలలో ఇండియా కూటమి దాంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు మరింత సన్నగిల్లిన్నట్లే భావించవచ్చు.

ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే, వైఎస్ షర్మిల కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తుందని నమ్మబలుకుతున్నారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణని నిలిపివేయడంతో సహా కాంగ్రెస్‌ తరపున పలు హామీలు గుప్పిస్తున్నారు.

కానీ కేంద్రంలో కాంగ్రెస్‌ లేదా ఇండియా కూటమి అధికారంలోకి రాలేని పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా ఆమె ఈవిదంగా హామీలు ఇస్తుండటం ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది కదా?

ఈసారి ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపి-టిడిపి, జనసేనలమద్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. కనుక ఆమె ప్రయత్నాలు ఫలిస్తే, కాంగ్రెస్ పార్టీ కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోగలరు తప్ప గెలిచి ఏపీలో అధికారంలోకి రాలేదు. అంటే ఆమె ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించుకోవడానికే తప్ప ఆమె ఇచ్చే హామీలకు విలువలేదని అర్దమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories