పాత నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం తర్వాత అసలు ఎంత మొత్తంలో ఆర్బీఐకు పాత నోట్లు చేరుకున్నాయి? అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే… ప్రభుత్వం అంచనా వేసిన దాని కంటే రెట్టింపు సంఖ్యలో పాత నోట్లు బ్యాంకులకు వచ్చాయని, ఈ కారణం చేతనే అసలు ఈ విలువను మోడీ సర్కార్ ప్రకటించడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ప్రకటన చేసారు.
ఆర్బీఐకు చేరుకున్న పాత నోట్లల్లో ఎంత మొత్తం అసలు కరెన్సీ ఉందో, ఎంత మొత్తం నకిలీ ఉందో తెలియాల్సి ఉందని, ఇది చాలా పెద్ద ప్రక్రియ అని, ఇదంతా పూర్తయిన తర్వాత, అసలు వివరాలు బయటకు వెల్లడిస్తామని చెప్పిన అరుణ్ జైట్లీ, నోట్ల రద్దు తర్వాత ఎంత మొత్తంలో కరెన్సీ ముద్రణ జరిగిందనే విషయాన్ని వెల్లడించింది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు మొత్తం 11,64,100 కోట్ల విలువైన కరెన్సీ మార్కెట్ లో చలామణిలోకి వచ్చిందని పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు.
మరి ఇంత మొత్తంలో సర్కార్ కరెన్సీ విడుదల చేసినప్పటికీ, బ్యాంకుల వద్ద, ప్రజల వద్ద తాజాగా ఎందుకు కరెన్సీ కొరత ఏర్పడింది అన్న దానికి సమాధానమే ‘ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు’గా చెప్పవచ్చు. నగదుపై ఆంక్షలు పెట్టిన మోడీ సర్కార్ నిర్ణయంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు, క్యాష్ విత్ డ్రాలు చేసుకుని తమ వద్దనే ఉంచుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే మరో పక్కన బ్యాంకులు విధిస్తున్న సర్వీస్ చార్జీలతో ప్రజలు విసుగుచెందడంతో, తమ డబ్బుతో బ్యాంకులు, ప్రభుత్వం ఆడుకుంటున్నాయన్న భావనకు వచ్చేసారు.



