ఇది ఎర్ర బస్సా..?
బస్సుల్లో, రైళ్లలో సీటు దొరకకపోతే నిలబడి ప్రయాణం చేసే సదుపాయం ఉంటుందన్న విషయం తెలిసిందే. జీవితంలో ఏదొక సందర్భంలో ఎంతటి వారికైనా ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఇక హైదరాబాద్ వంటి మహా నగరాల్లో అయితే, ప్రయాణికులకు నిత్యం ఎదురయ్యే అత్యంత సాధారణ అనుభవమే ఇది. రైళ్ళు, బస్సులు వంటి రోడ్లపై నడిచే వాహనాల గురించి అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఎవరి ఊహకూ అందని విధంగా విమానంలో కూడా అటువంటి సంఘటనే చోటు చేసుకుంటే..?! అవును… జరిగింది కూడా..!
విమానంలో ప్రయాణికులను నిలబెట్టి తీసుకెళ్లడం ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిసారి. పాకిస్థానీ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సంస్థ సౌదీ అరేబియాకు వెళ్లే విమానంలో ఏడుగురు ప్రయాణికులను అలా విమానంలో సీటు లేకుండా నిలబెట్టి ప్రయాణించేలా చేసింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు మాట్లాడుతూ కరాచీ నుంచి మదీనా వెళ్లే విమానంలో మొత్తం సీట్లన్నీ నిండిపోయాయని, తర్వాత కూడా ఆ విమానంలోకి ఏడుగురిని ఎక్కించి తీసుకెళ్లిన మాట వాస్తవమేనని చెప్పారు.
చేత్తో రాసిన బోర్డింగ్ పాస్లు ఇచ్చి సదరు ప్రయాణికులను విమానం ఎక్కించారు. ఇలా తీసుకెళ్లడం ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. ఎమర్జెన్సీగా కావల్సి వస్తే ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్కులు తగినంతగా ఉండవని అన్నారు. ఈ విషయం గురించి సదరు విమాన ఫైలట్ స్పందిస్తూ… తాను టేకాఫ్ తీసుకున్న తర్వాత చూస్తే కొంతమంది అదనంగా కనిపించారని, తనకు ఈ విషయం గురించి ఎవ్వరూ చెప్పలేదని, మరో ప్రత్యామ్నాయం లేక అలా తీసుకు వెళ్ళాల్సి వచ్చిందని చెప్పాడు.



