ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్చనిస్తున్నట్లు ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆపరేషన్ సింధూర్ దెబ్బతో షాక్ తిన్న పాకిస్థాన్ ప్రభుత్వం కూడా భారత్ని ఎదుర్కొనేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్చనిస్తున్నట్లు ప్రకటించింది. ఈరోజు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కార్యాలయంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే భారత్తో యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే!
అయితే పాక్ ప్రభుత్వం దశాబ్ధాలుగా పాక్ సైన్యాధికారుల కనుసన్నలలోనే నడుస్తోందనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. పాక్లో సైనిక తిరుగుబాటు కూడా జరిగింది. పాక్ మాజీ సైన్యాధ్యక్షుడు జియా ఉల్ హక్ ప్రభుత్వాన్ని తన అధీనంలోకి తీసుకొని నిరంకుశ పాలన చేశారు కూడా.
పాక్ పాలకులలో కొంతమంది భారత్తో సఖ్యత కోరుకున్నారు. కానీ పాక్ సైన్యాధికారులు అటువంటి వారిని ప్రధాని పదవిలో ఎక్కువ కాలం ఉండనీయలేదు.
కనుక పాక్లో సైన్యం నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుస్తుంటాయి. కనుక పాక్ సైన్యానికి ప్రభుత్వం అనుమతి అవసరమే లేదని చెప్పవచ్చు. అయినప్పటికీ పద్దతిగా అనుమతి మంజూరు చేశారు.
భారత్తో రెండుసార్లు యుద్ధంలో పాక్ ఓడిపోయినప్పటికీ పాక్ సైన్యాధికారులు యుద్ధమే కోరుకుంటారు. అణు బాంబులు చూసుకునే వారికి ఆ ధైర్యం కలిగి ఉండవచ్చు.
అందుకే పాక్ మంత్రులు కూడా భారత్పై అణు బాంబులు ప్రయోగిస్తామని చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు.
తమ వెంట యావత్ దేశ ప్రజలు ఉన్నారని పాక్ మంత్రులు చెప్పుకుంటున్నారు. కానీ వారి అసమర్దత, అవినీతి పాలనకు మూల్యం చెల్లిస్తున్న పాక్ ప్రజలు వారి వెంట ఉంటారని అనుకోలేము.
కానీ భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించగానే యావత్ భారతీయులు ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ సంఘీభావం తెలుపుతున్నారు.
భారత్తో యుద్ధానికి పాక్ సైన్యాధికారులు తహతహలాడుతున్నారు. ఇప్పుడు శాస్త్ర ప్రకారం కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. కనుక నేడో రేపో యుద్ధానికి బటన్ నొక్కడం ఖాయమే.
కనుక వారికి ట్రంప్ లేదా మరొకరు బ్రేకులు వేసి ఆపుతారా లేదా?ఆపలేకపోతే పాక్ దాడిని భారత్ ఎంత సమర్ధంగా తిప్పికొడుతుంది?ఈ యుద్ధం పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయనేది రాబోయే రోజుల్లో భారత్, పాక్ ప్రజలతో పాటు యావత్ ప్రపంచ దేశాలు చూడబోతున్నాయి.




