అవాక్కయ్యే విధంగా ఉన్నట్లుండి తిరుగుబాటు ప్రకటించిన పన్నీర్ సెల్వం వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారనేది శశికళ వర్గీయుల ఆరోపణ. అయితే అప్పటివరకు సైలెంట్ గా ఉండడమే కాక, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ పేరును స్వయంగా ప్రకటించిన పన్నీర్, ఒక్కసారిగా స్వరం పెంచడం వెనుక బిజెపి ఉందని కొందరు, డిఎంకే ఉందని మరికొందరు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పన్నీర్ తన తాజా వ్యాఖ్యలలో తన వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో బయటపెట్టారు.
‘అమ్మ’ జయలలిత ఆత్మ తమను నడిపిస్తోందని, సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుందని, అది తమ వైపే ఉందని వ్యాఖ్యానించారు. తమిళ ప్రజల ప్రయోజనాలను కాపాడాలనుకునే అన్నాడీఎంకే నేతలందరూ తమవైపుకి వస్తారని తనకు నమ్మకం ఉందని అన్నారు. అంతకుముందే శశికళకు షాక్ ఇస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాండ్య రాజన్, శశికళ క్యాంపు నుండి బయటకు వచ్చారు. మొన్న గవర్నర్ విద్యాసాగర్ రావును శశికళ కలిసినప్పుడు ఆమె వెంట పాండ్య రాజన్ కూడా ఉన్నారు. శశికళకు గుడ్ బై చెప్పిన రాజన్… పన్నీర్ సెల్వం వర్గంలోకి వెళతారని విశ్వసనీయ సమాచారం. తాను ఎంతగానో నమ్మిన రాజన్ తనను వీడటంతో శశికళ షాక్ కు గురయ్యారు.
రోజు రోజుకు తమిళనాట పన్నీర్ సెల్వంకు మద్దతు అమాంతం పెరుగుతోంది. ముఖ్యమంత్రి పదవిలో పన్నీర్ సెల్వం కొనసాగాలని రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. శశికళ నియంతృత్వ ధోరణిని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శశికళ సీఎం అయితే మన్నార్ గుడి మాఫియా అరాచకాలను భరించలేమని తమిళ ప్రజలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ తమిళ దినపత్రిక సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ఫలితాల్లో పన్నీర్ సెల్వం సీఎంగా ఉండాలని 97 శాతం మంది ప్రజలు కోరుకున్నారు. శశికళకు కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.



