అవును… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కొంత సమయం పాటు నమ్మవద్దు. పవన్ ఏం చెప్పినా అస్సలు పట్టించుకోవద్దు. అందులో నిజం ఎంత ఉందనే విషయం ఖరారైన తర్వాత మాత్రమే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉన్నట్లుండి… ఎందుకు పవన్ పై ఇలా ప్రచారం జరుగుతుంది అంటే… ట్విట్టర్ వేదికగా పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించే పవన్ కళ్యాణ్ అకౌంట్ హ్యాకింగ్ గురైందని ‘జనసేన’ కార్యాలయం ధృవీకరించింది. దీంతో మళ్ళీ ఖాతా ఓపెన్ అయ్యే వరకు ఎలాంటి ట్వీట్లు గానీ, సమాచారం ఇచ్చినా గానీ పట్టించుకోవద్దని స్వయంగా జనసేన పార్టీ కార్యాలయమే అధికారికంగా కోరింది.
అయితే ఇప్పటివరకు అయితే పవన్ ట్విట్టర్ ఖాతా నుండి ఎలాంటి వివాదాస్పద ట్వీట్లు వెల్లడికాలేదు. మరి అయినప్పటికీ ఎలా హ్యాకింగ్ కు గురైందని తెలిసిందంటే… పలు సామాజిక అంశాలపై పవన్ చేసిన ట్వీట్లు నెటిజన్లకు చేరకపోవడంతో, అనుమానపడ్డ జనసేన నేతలు, సాంకేతిక విభాగాన్ని మరియు ట్విట్టర్ ఇండియాను సంప్రదించగా, పవన్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని సమాచారం అందించారు. దీంతో ఎలాంటి పొరపాట్లు జరుగుతాయోనన్న ఉద్దేశంతో మీడియా వర్గాలకు సదరు సమాచారాన్ని జనసేన కార్యాలయం అందించి, వివాదాలు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
మళ్ళీ పాస్ వర్డ్ ను సెట్ చేసుకుని, అంతా ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ ‘జనసేన’ కార్యాలయం నుండి సమాచారం వెలువడనుంది. దీంతో కొంత సమయం పాటు పవన్ కళ్యాణ్ ‘ట్విట్టర్’ ఖాతా నుండి ఎలాంటి వివాదాస్పద ట్వీట్లు వచ్చినా… వాటిని విశ్వసించాల్సిన పనిలేదు. అయితే ఇది నిజంగా హ్యాకింగ్ గురైందా? లేక ‘ఇంటి దొంగ’లు ఎవరైనా హ్యాకర్లకు సమాచారం ఇచ్చారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ కు గురవ్వడం సహజమే అయినా, పవన్ రాజకీయంగా యాక్టివ్ గా ఉండడంతో మరింత ప్రాధాన్యతను దక్కించుకుంది.



