చిత్రం: “పాపం ప్రతాప్”
M9 రేటింగ్: 1/5
విడుదల తేదీ: ఏప్రిల్ 17, 2026
తారాగణం: తిరువీర్, పాయల్ రాధాకృష్ణ, అజయ్ ఘోష్, రాశి, గోపరాజు రమణ, అవసరాల శ్రీనివాస్ తదితరులు
నిర్మాణ సంస్థ: ఈటీవీ విన్ – కృషి ఎంటర్టైన్మెంట్స్
దర్శకత్వం: ఎస్.పి.దుర్గా నరేష్
సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ
నిర్మాత: గడ్డం రాకేష్ రెడ్డి – రుద్రదేవ్ మదిరెడ్డి
ఛాయాగ్రహణం: విశ్వేశ్వర ఎస్.వి
కూర్పు: అన్వర్ అలీ
ఈటీవీ విన్ సంస్థ థియేటర్లకి తీసుకొచ్చిన తాజా చిత్రం “పాపం ప్రతాప్”. తిరువీర్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా ఎస్.పి.దుర్గానరేష్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రతాప్ ప్రాబ్లం ఏంటి? బుజ్జమ్మ ఎందుకు వెళ్లిపోయింది? అనే క్యూరియాసిటీ రైజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మరి సినిమా ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అయ్యిందా లేదా అనేది చూద్దాం..!!
కథ:
చిన్నప్పటినుండి ప్రేమించిన అమ్మాయి బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను పెళ్లి చేసుకొని, సంతోషంగా సొంత ఊర్లో ఉండాలనుకుంటాడు ప్రతాప్ (తిరువీర్). కట్ చేస్తే.. మూడు రాత్రులు గడిపిన తర్వాత నాలుగో రోజు ఉదయమే వెళ్లి పంచాయితీ పెడుతుంది బుజ్జమ్మ. తాను ప్రతాప్ తో ఉండలేనని, రాత్రుళ్లు చాలా ఇబ్బందిపెడుతున్నాడని తన బాధ చెప్పుకుని, తండ్రి బండెక్కి ఇంటికెళ్లిపోతుంది. ఇంతకీ ప్రతాప్ రాత్రుళ్ళు బుజ్జమ్మను పెట్టిన ఇబ్బంది ఏమిటి? తన సమస్యను ప్రతాప్ ఎలా తెలుసుకోగలిగాడు? దాన్ని ఎలా అధిగమించగలిగాడు? బుజ్జమ్మని ఇంటికి తిరిగి తెచ్చుకోగలిగాడా? లేదా? వంటి ప్రశ్నలకి సమాధానమే “పాపం ప్రతాప్” చిత్రం.
నటీనటుల పనితీరు:
తిరువీర్ తాను పోషించే పాత్రకి ఎప్పుడూ 100% న్యాయం చేస్తాడు. భయం, సిగ్గు, తప్పును అంగీకరించే మనస్తత్వం తాలూకు భావాలన్నీ నిజాయితీతో ప్రెజంట్ చేశాడు. కానీ.. క్యారెక్టర్ ఆర్క్ అనేది లేకపోవడం, క్యారెక్టర్ కి ఉన్న సమస్య అనేది రిలేటబుల్ గా కానీ, ఆలోచనాత్మకంగా కానీ లేకపోవడంతో ఆ క్యారెక్టర్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు.
పాయల్ రాధాకృష్ణ నటిగా కొన్ని భారీ ఎమోషన్స్ ను పండించడంలో తేలిపోయింది. అందువల్ల ఆమె పాత్ర ద్వారా వర్కవుట్ అవ్వాల్సిన డ్రామా అసలు పండలేదు.
అజయ్ ఘోష్ కామెడీ కొన్ని చోట్ల నవ్వుకునేలా ఉంది కానీ, రొటీన్ ఫీల్ కలిగించింది. గోపరాజు రమణ కామెడీ ఎవరికీ కనెక్ట్ అవుతుంది అనుకున్నారో తెలియదు కానీ.. చాలా ఎబ్బెట్టుగా ఉంది.
రాశిని తల్లి పాత్రలో, అది కూడా అజయ్ ఘోష్ భార్యగా చూడ్డానికి కొత్తగా ఉన్నా.. ఆమె పాత్ర కూడా మెప్పించలేకపోయింది.
సాంకేతికవర్గం పనితీరు:
సినిమాకి ఉన్న అతి తక్కువ ప్లస్ పాయింట్స్ లో విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ వర్క్ ఒకటి. ఉన్నంతలో మంచి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చాడు. కే.ఎం.రాధాకృష్ణ పాటలు పర్వాలేదు అనిపించినా, నేపథ్య సంగీతం మాత్రం సినిమాలోని ఎమోషన్ ని ఎలివేట్ చేయలేకపోయింది.
దర్శకుడు ఎస్.పి.దుర్గా నరేష్ ఎంచుకున్న పాయింట్ కి చాలా మంచి స్కోప్ ఉంది. కానీ.. ఆ పాయింట్ ను డీల్ చేసిన విధానం పెద్ద మైనస్. అసలు హీరో పాత్రకి కానీ, హీరోయిన్ పాత్రకి కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. ఏ ఒక్క సన్నివేశం లేదా సందర్భంలో పాత్రల మీద, లేదా సమస్య మీద జాలి కలగదు. అందువల్ల నిజానికి సమస్య పెద్దదే అయినప్పటికీ, ఇదేం పెద్ద సమస్య కాదు కదా అనిపిస్తుంది. అందుకు కారణం కథనంలో క్లారిటీ లేకపోవడమే. దర్శకుడిగా, రచయితగా దుర్గానరేష్ కనీస స్థాయిలో కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడనే చెప్పాలి.
విశ్లేషణ:
ఈమధ్య ప్రతి సినిమాకీ అనవసరమైన సెన్సేషనలైజేషన్ కామన్ అయిపోయింది. గతంలో విడుదలైన “హేయ్ బల్వంత్” విషయంలో జరిగిన తప్పు కూడా ఇదే. అదేదో అస్సలు చెప్పుకోలేని బిజినెస్ అని హడావుడి చేసి, సినిమా ఓపెనింగ్ ఫ్రేమ్ లోనే అదేంటి అనేది రివీల్ చేసి ఆడియన్స్ కి డిజప్పాయింట్ చేసారు. ఇప్పుడు “పాపం ప్రతాప్” విషయంలోనూ ఈటీవీ విన్ డిజిటల్ వింగ్ చేసిన “పగలు మనిషి, రాత్రి మృగం” అనే ప్రమోషన్ సినిమా మీద రాంగ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేయగా, విడుదల చేసిన టీజర్, ట్రైలర్ తోనూ ఆ తప్పే చేశారు మేకర్స్. అయినా.. మేకింగ్ పరంగా చూసుకున్నా, కంటెంట్ పరంగా చూసుకున్నా ఇది ఓటీటీ సినిమా. దాన్ని కష్టపడి థియేటర్లకి ఈడ్చుకొచ్చి ఈటీవీ విన్ సంస్థ తమ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటుంది.
ఓవరాల్ గా.. అయ్యో పాపం ప్రేక్షకులు!
M9 రేటింగ్: 1/5




