రావణుడిని గెలవాలంటే వానరసైన్యం అవసరమే!

Paritala_Sriram_TDP

మహాశక్తివంతుడైన రాక్షసరాజు రావణుడితో పోరాడేందుకు శ్రీరాముడు వానరసైన్యం సాయం తీసుకొన్నాడు. రాక్షస మూకలను వానర సైన్యం ఎదిరించి పోరాడగలదా? అని అనుమానించలేదు. రావణ వధకు ‘ఉడతాభక్తి’గా ప్రతీ ఒక్కరూ శ్రీరాముడికి తోడ్పడ్డారు. వారి సాయంతో శ్రీరాముడు రాక్షస సంహారం చేసి సీతమ్మను కాపాడుకొన్నాడు. రాక్షస పాలన నుంచి లంకకు విముక్తి కల్పించాడు. అందరికీ తెలిసి ఈ కధ ఇప్పుడు చెప్పుకొంటుంటే, ఆంధ్రాలో రాజకీయాలు కళ్ళ ముందు మెదలితే ఆశ్చర్యం లేదు.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని రాక్షసరాజు వంటి జగన్మోహన్‌ రెడ్డి పరిపాలిస్తున్నాడని, ఆ రాక్షసుడిని ఓడించడం ఏ ఒక్క పార్టీ వల్లో కాదని, ఇటువైపు ఉన్న ప్రతీ ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాల్సి ఉంటుందని టిడిపి నేత పరిటాల శ్రీరామ్ అన్నారు.

త్వరలో జరుగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో టిడిపి, జనసేనలు కలిసి పోరాడి, రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని రక్షించుకొంటాయని పరిటాల శ్రీరామ్ అన్నారు. టిడిపి, జనసేనలు మాత్రమే కాదు… ఆంధ్రప్రదేశ్‌ని కాపాడుకోవాలనుకొంటున్న ప్రతీ ఒక్కరూ ఈ మహాయుద్ధంలో ‘ఉడతాభక్తిగా’ ధర్మపోరాటానికి సిద్దం కావాలన్నారు.

టిడిపి నేతలపై కేసులు నమోదు చేసి జైలుకి పంపించి, రాష్ట్రంలో ప్రతిపక్షం అడ్డులేకుండా చేసుకొని ఎన్నికలలో గెలవాలని వైసీపి కుట్ర చేస్తోందని కానీ గతంలో ఇటువంటి దురాలోచనలు చేసిన అనేక పార్టీలు, వాటి అధినేతలు కాలగర్భంలో కలిసిపోయారని పరిటాల శ్రీరామ్ గుర్తు చేశారు.

ఒకప్పుడు అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలతో అల్లాడిపోయేదని, టిడిపి పాలనలో మళ్ళీ ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా చేస్తే, వైసీపి పాలనలో మళ్ళీ గ్రామాలలో ఫ్యాక్షన్ విషసర్పం పడగ విప్పి బుసలు కొడుతోందని పరిటాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో తన తండ్రి పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలలో పర్యటించి, ఇరు వర్గాల మద్య రాజీ కుదిర్చి అందరూ ప్రశాంతంగా జీవించేందుకు ఎంతగానో కృషి చేశారని పరిటాల శ్రీరామ్ అన్నారు. ఇపుడు తాను కూడా తన తండ్రి మార్గంలోనే ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలలో పర్యటిస్తూ మళ్ళీ అందరినీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.

ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలు, అవసరాల కోసం సామాన్య ప్రజల జీవితాలతో ఆటలాడుకోరాదని, అటువంటి పార్టీలకు ప్రజలు కూడా దూరంగా ఉండాలని పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు.

ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపిని ఓడించి గద్దె దించకపోతే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ ఊహించుకోవడానికే భయం వేస్తోందని పరిటాల శ్రీరామ్ అన్నారు.

ADVERTISEMENT
Latest Stories