ప్రముఖ సినీనటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమెకు పాస్ పోర్టు పుస్తకాన్ని ఇచ్చేందుకు చెన్నై రీజినల్ పాస్ పోర్టు కార్యాలయం నిరాకరించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమెపై మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని… అందువల్ల ఆమెకు పాస్ పోర్టు పుస్తకాన్ని ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
దీనిపై ఖుష్బూ స్పందిస్తూ, ఆ కేసులన్నీ ఎన్నికలకు సంబంధించినవని… వాటిపై హైకోర్టు స్టే కూడా విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాస్ పోర్టు 2022 వరకు చెల్లుబాటులో ఉందని… తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్లడం వల్ల తన పాస్ పోర్టు పుస్తకంలోని అన్ని పేజీలపై స్టాంప్ లు వేసి ఉన్నాయని ఆమె చెప్పారు.
కొత్త పుస్తకం కోసం దరఖాస్తు చేస్తే ఇవ్వడం లేదని ఆరోపించారు. అంతేకాదు, తనకు పాస్ పోర్టు పుస్తకం ఇచ్చేలా ఆదేశించాలంటూ మద్రాస్ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. దాదాపుగా ఓ దశాబ్ద కాలం తర్వాత పవన్ – త్రివిక్రమ్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ నటీమణికి జరిగిన విషయం టాలీవుడ్ నాట కూడా హాట్ టాపిక్ అయ్యింది.



